దేశభక్తి సరే.. రాష్ట్రభక్తి వద్దా!
ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి బండి లేఖలు
పర్యావరణ, అటవీ అనుమతులివ్వొద్దంటూ విన్నపాలు
తెలంగాణ వరకే ప్రత్యేకచట్టం తేవాలంటూ సలహాలు
రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు పెడతారా?
సీడబ్ల్యూసీ అనుమతులిచ్చేదాకా.. ఇతర అనుమతులు రావద్దా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై మండిపడ్డ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆర్థికమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని.. ఇందుకోసం అవసరమైతే తెలంగాణకు ప్రత్యేక చట్టం తేవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్, షెకావత్కు లేఖలు రాయడమేమిటని ప్రశ్నించారు. ఎప్పుడు మాట్లాడినా దేశభక్తి అంటుంటారని.. దేశభక్తి సరే మరి స్వరాష్ట్రంపై భక్తి ఎక్కడికి పోయిందని నిలదీశారు. బండికి రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై, రాష్ట్ర రైతాంగంపై ప్రేమలేదని, రాజకీయప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలా?
‘మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లం.. రాజకీయాల్లో ఉన్నవాళ్లం.. ప్రజలకు సేవచేయాల్సిన వాళ్లం.. పదవులు ఇయ్యాల ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. పదవులు శాశ్వతం కాదు. రాష్ట్రం శాశ్వతం.. రాష్ట్రప్రజలు శాశ్వతం.. రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం. ఈ మధ్య ఎంపీ బండి సంజయ్.. కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్, షెకావత్కు లేఖలు ఇచ్చారు. కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ అన్ని అనుమతులు ఇచ్చేదాకా ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వొద్దంటూ అందులో కోరారు. అవసరమైతే తెలంగాణ కోసమే ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలని కూడా సూచించారు. రాష్ట్ర ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటేనే కదా మీరు అక్కడికి వెళ్లింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమా? ఒక ప్రాజెక్టు కోసం సీడబ్ల్యూసీలో 16 డైరెక్టరేట్లలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటవీ, పర్యావరణం, తదితర శాఖల అనుమతుల కోసం వేర్వేరుగా ప్రయత్నిస్తుంటాం. కానీ, సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చేవరకు తెలంగాణకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖ ఎలా రాస్తారు? తెలంగాణ కోసమే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎలా కోరుతారు? బీజేపీ నేతలకు రాజకీయ భుక్తి మీద ధ్యాస తప్ప రాష్ట్రంపై భక్తి లేదు.. రైతుపై అంతకన్నా భక్తి లేదు. దీనిని రాష్ట్ర రైతాంగం, రాష్ట్ర ప్రజలంతా గమనించాలి’అని హరీశ్రావు పేర్కొన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బంగారు పంటలు పండుతాయని రైతులంతా ఎదురుచూస్తుంటే వారి నోట్లో మట్టి కొడతారా? అని నిలదీశారు. ‘చేతనైతే సాయం చేయండి కానీ, ఇలా కాళ్లలో కట్టెలు పెట్టే పని చేయొద్దు’ అని హితవుపలికారు. గతంలో చాలామంది చాలా కేసులు వేశారు.. రైతులను రెచ్చగొట్టారని, ఇప్పుడు వీళ్లు ఏకంగా తెలంగాణ కోసం ప్రత్యేకంగా చట్టమే తీసుకురావాలని కోరేంత బరితెగించారని మండిపడ్డారు. వారికి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకురావాలని.. అప్పుడు సభలోనే సన్మానం చేస్తామని తెలిపారు.
ఒక్క నల్లగొండకే 17 లిఫ్ట్లు
వన్వే టన్నెల్ పెట్టడం వల్ల ఎస్సెల్బీసీ ఆలస్యమవుతున్నదని హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక్క నల్లగొండ జిల్లాకే 17 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను మంజూరుచేశారని తెలిపారు. రూ. 2,426 కోట్లతో నిర్మించే ఈ లిఫ్ట్లతో ఉమ్మడి జిల్లాలోని కృష్ణపట్టె, సాగర్ ఆయకట్టు చివరి భూములు సస్యశ్యామలంగా మారుతాయని చెప్పారు. సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని హరీశ్రావు అన్నారు. గతంలో వేసవి కాలం వస్తే నీటికోసం ప్రజలు అల్లాడేవారని.. నేడు తెలంగాణలో మండుటెండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని తెలిపారు. గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన పలు పద్దులకు సభ ఆమోదం తెలిపింది.
మిషన్ భగీరథ మంచి పథకం: కోమటిరెడ్డి
మిషన్ భగీరథ ఎంతో మంచి పథకమని, ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం చాలా గొప్ప విషయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కొనియాడారు. ప్రతిఇంటికీ నీటినందించడం కష్టతరమే అయినప్పటికీ.. మన అధికారులు, మన ప్రభుత్వం కలిసి దాన్ని సుసాధ్యం చేసిందని తెలిపారు.
ఆ ప్రాజెక్టుల అంచనాలు వందల రేట్లు పెరిగినయ్
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని, దాంట్లో ఏదో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పే కుటిల యత్నాలు చేస్తున్నాయని హరీశ్రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు డీపీఆరే లేదంటూ ఆరోపణలు చేస్తున్నారని.. ఇంతకంటే దారుణమేమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. డీపీఆర్ ఇవ్వకుండా సీడబ్ల్యూసీ, అటవీ, పర్యావరణ అనుమతులు ఎలా వస్తాయని నిలదీశారు. చివరకు పలుశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) అనుమతి కూడా వచ్చిందని చెప్పారు. తెలంగాణలో గతంలో కట్టిన ప్రాజెక్టుల అంచనాలు ఎన్నిరెట్లు పెరిగాయో.. కట్టడానికి ఎన్నేండ్లు పట్టిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును రూ.122 కోట్ల అంచనాతో 1954లో శంకుస్థాపన చేస్తే.. పూర్తయ్యేనాటికి దాని విలువ రూ.1,183 కోట్లు అని తెలిపారు. ఆ ప్రాజెక్టు అంచనా విలువ 8.7 రెట్లు (800 శాతం) పెరిగిందని అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 10వేల శాతం పెరిగిందని, జూరాల ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి 25 రెట్లు పెరిగిందని వివరించారు. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేశారని తెలిపారు.