హైదరాబాద్ : నగరంలో మరో 10 ఘన వ్యర్థ నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ జి. విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్లోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను మేయర్ గురువారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణకు అందుబాటులో ఉన్న ఉత్తమ పద్ధతులను అవలంభిస్తున్న అధికారులను మేయర్ ఈ సందర్భంగా అభినందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 21 ఘన వ్యర్థ నిర్వహణ ప్లాంట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ తెలిపారు.
వీధులు, రహదారులు చెత్త, చెదారంతో కాకుండా స్వచ్ఛ హైదరాబాద్గా ఉండటమే తమ లక్ష్యమన్నారు. సంజీవయ్య పార్కులోని ఘన వ్యర్థ నిర్వహణ ప్లాంట్ను మేయర్ తనిఖీ చేసిన సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ప్లాంట్ ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించాల్సిందిగా కోరారు. అడిషనల్ కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్ ప్రవీణ్య ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.