హైదరాబాద్ : శాసనసభలో పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం పహాడీ షరీఫ్లోని దర్గా హజ్రత్ బాబా షరీఫుద్దీన్ సాయబ్ వద్ద ప్రస్తుతమున్న జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ.. సీసీ రోడ్డు ర్యాంపు రోడ్లు, మోటరబుల్ ట్రాక్, ఫోర్ వీలర్ వాహనాలను కొండపైకి పార్కింగ్ స్థల నిర్మాణం కోసం గ్రాంట్ కింద.. 9 కోట్ల 60 లక్షల మొత్తాన్ని 2017 సంవత్సరంలో 264 జీవో ద్వారా ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్ట ఈడబ్ల్యూఐడీసీకి అప్పగించామని చెప్పారు.
అదే విధంగా మౌలాలి వద్ద ర్యాంపు నిర్మాణాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు తెలిపారు. అన్ని మతాలను గౌరవించడంతో పాటు ఆ మత విశ్వాసాలకు సంబంధించిన మసీదులు, చర్చిలు, ఇతర టెంపుల్స్ను అభివృద్ధి చేస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పహాడీ షరీఫ్ దర్గాకు దేశం నలుమూలాల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ దర్గాను అభివృద్ధి చేయాలని కోరినప్పుడు.. సీఎం కేసీఆర్ దాన్ని గొప్పగా నిర్మాణం చేస్తామని చెప్పి నిధులు కేటాయించారని తెలిపారు. ఈ దర్గా వద్ద ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి అని పేర్కొన్నారు. మౌలాలి వద్ద ర్యాంపు కోసం రూ. ఒక కోటి 87 లక్షలు మంజూరు చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.