భాగ్యనగరం పెట్టుబడులకు వేదికవుతున్నది. పేరొందిన పరిశ్రమలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దిగ్గజ కంపెనీలు నగరంలో కొలువుదీరుతున్నాయి. టీఎస్ ఐపాస్తో సులభతర అనుమతులు, చక్కటి వాతావరణం, మౌలిక వసతులు, శాంతిభద్రతలు, రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండడంతో ఏడేండ్లలో రాజధాని అనూహ్య ప్రగతి సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 15 వేలపైచిలుకు పరిశ్రమలు ఏర్పాటు కాగా, 33 భారీ కంపెనీలు తమ సంస్థలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్, రక్షణ, ఆహార తదితర 14 రంగాలకు చెందిన పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి. వీటివల్ల దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించగా, పరోక్షంగా లక్షలాదిమంది లబ్ధి పొందుతున్నారు. ప్రధానంగా నగర శివార్లలో పారిశ్రామికవాడల ఏర్పాటు పెట్టుబడులకు అనుకూలంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012-13లోఐటీ రంగం ద్వారా రూ.49,831 కోట్ల పెట్టుబడులు రాగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడేండ్లలో రాకెట్ వేగంతో పుంజుకొని 2020-21 మధ్య నాటికి రూ.2.16 లక్షల కోట్ల పెట్టుబడులు రావడడం అసాధారణ విషయం.
భాగ్యనగరం అభివృద్ధిలో ‘విశ్వ’రూపం చూపిస్తున్నది. ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా నిలిచి.. పెట్టుబడులు, ఉపాధి కల్పనలో హైదరా‘బాద్ షా’గా నిలుస్తున్నది. 33 ప్రపంచస్థాయి కంపెనీలు, 15 వేలకు పైగా పరిశ్రమలు,15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు.. ఇదంతా కేవలం ఏడేండ్లలోనే.. తెలంగాణ ప్రభుత్వ సంకల్ప సిద్ధితోనే సాధ్యమైంది.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా రాజధాని హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. ఏడేండ్లలోనే 15 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటుకాగా.. దేశవిదేశాల్లో పేరొందిన 33 భారీ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా 2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమల ఏర్పాటుతో 15 లక్షల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికరంగంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇందులోభాగంగా పరిశ్రమల స్థాపనను మరింత సులభతరం చేసేలా టీఎస్ ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)ను ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వం పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయడం పారిశ్రామికీకరణకు అనుకూలంగా మారింది. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తికాగా.. మరికొన్నింటి పనులు తుదిదశకు చేరుకున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఫార్మాసిటీ, సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్కు, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రియల్ పార్కు, జహీరాబాద్లో నిమ్జ్, దండు మల్కాపూర్లో టీఐఎఫ్-ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో జనరల్ పార్కు, సిద్దిపేటలో సీడ్ ప్రాసెసింగ్ పార్కు, బండతిమ్మాపూర్ వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, రావిర్యాలలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, మెదక్ జిల్లా తూప్రాన్లో ఆటోమేటివ్ అండ్ ఇంజినీరింగ్ క్లస్టర్, ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ కంపోసైట్ పార్కు, యాదాద్రి జిల్లా రాయరావుపేటలో సూక్ష్మతరహా పరిశ్రమల పార్కు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లాల్గడి మలక్పేట, సిద్దిపేట కర్కపట్లలో బయో టెక్నాలజీ పార్కు తదితర పారిశ్రామికవాడలు నగరశివారు జిల్లాల్లో కొలువుదీరాయి. ఇవన్నీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్శిస్తూ రాష్ర్టాన్ని పరిశ్రమలకు స్వర్గధామంగా మలిచారు. మరోవైపు, హైదరాబాద్ శివారు ప్రాంతాలు పరిశ్రమలకు గమ్యస్థానంగా మారడంతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి ఇక్కడికి ఉపాధి, ఉద్యోగాల కోసం వలసలు అధికమయ్యాయి.
ప్రపంచంలోనే పేరుగాంచిన అమెజాన్.. చందన్వెల్లి, ముచ్చెర్ల, రావిర్యాలలో తమ డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. చందన్ల్లిలో రూ.5,800 కోట్లు, ముచ్చెర్లలో రూ.5,802 కోట్లు, రావిర్యాలలో రూ.5,821 కోట్ల భారీ పెట్టుబడులు పెడుతున్నది. ఈ క్యాంపస్లలో దాదాపు 1,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అమెరికా తరువాత తమ అతిపెద్ద డేటా కేంద్రాల ఏర్పాటుకు అమెజాన్ హైదరాబాద్ను ఎన్నుకోవడం విశేషం. మరో అంతర్జాతీయ సంస్థ వెల్స్పన్ చందన్వల్లిలో దాదాపు రూ.2,400 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా దాదాపు 1,200 మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే, రూ.1,147.18 కోట్లతో వెల్స్పన్ అడ్వాన్స్డ్ ్డ మెటీరియల్స్ను ఏర్పాటు చేస్తుండగా, దాని ద్వారా మరో 709 మందికి ఉపాధి లభించనున్నది. విప్రో సంస్థ మహేశ్వరంలో తమ అతిపెద్ద కన్స్యూమర్ గూడ్స్ ఉత్పత్తి కేంద్రాన్ని రూ. 174 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసింది. అక్కడ 331మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్, బయాక్సియల్ ఓరియెంటెడ్ పాలీ ప్రొపైలిన్ (బీవోపీపీ) ఫిల్మ్స్, బయాక్సియల్-ఓరియెంటెడ్ పాలిథిన్ టెరెఫ్తాలేట్ (బీవోపీఈటీ) ఫిల్మ్లు, పీఈటీ రెసిన్ చిప్లను ఉత్పత్తి చేస్తున్నది. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఉత్పత్తుల కోసం రూ. 520కోట్లతో నగర శివార్లలో పరిశ్రమను పెట్టింది. 300 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది.
ప్రపంచంలోనే పేరుగాంచిన అమెజాన్, వెల్స్పన్, విప్రో, కోకా కోలా, ఐకియా, అదానీ డిఫెన్స్, ఇండో యూకే హెల్త్కేర్ తదితర అనేక సంస్థలు హైదరాబాద్లో సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇందులో 23 కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించగా, మరో 10 కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏడేండ్లలోనే 33 భారీ సంస్థలు రాష్ర్టానికి రావడం గర్వకారణం. వాటిద్వారా సుమారు రూ.26 వేల కోట్ల వరకూ పెట్టుబడులు రాగా, 53 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న సరళతర విధానాలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పేరొందిన కంపెనీలు హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయి. కరోనా ఉన్నప్పటికీ తెలంగాణలో గతేడాది ఐటీ ఎగుమతులు జాతీయ సగటుకంటే అధిక వృద్ధిరేటును నమోదు చేస్తూ 1.4 లక్షల కోట్లకు చేరడం విశేషం.
2012-13లో రాష్ర్టానికి ఐటీ రంగం ద్వారా రూ.49,831కోట్ల పెట్టుబడులు రాగా, 2013-14లో రూ.57,258 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ఏర్పాటైన తరువాత తెలంగాణ సర్కారు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న సరళతర విధానాలతో పెట్టుబడుల రాకలో వేగం పుంజుకుంది. ఫలితంగా 2014-15 నుంచి క్రమంగా వృద్ధిని సాధిస్తూ.. 2020-21 వ్యవధిలోనే రూ.2.16 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఇక ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్, రక్షణ, ఆహార తదితర 14 రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పలు ప్రముఖ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని పరిశ్రమలను స్థాపించాయి. 15 ఎకరాల్లో మినీ పారిశ్రామిక వాడల నుంచి 2,500 ఎకరాల వరకు సుమారు 152 భారీ పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇప్పటివరకు 5,430 ఎకరాల స్థలాన్ని పరిశ్రమలకు కేటాయించారు. 1,45,682 ఎకరాల ప్రభుత్వ భూములను టీఎస్ఐఐసీ ల్యాండ్ బ్యాంక్ కింద నోటిఫై చేశారు.