ఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో యువ ఓపెనర్ పృథ్వీ షా ధనాధన్ బ్యాటింగ్తో రెచ్చిపోతున్నాడు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరదపారిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్-4లో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో బౌండరీల వర్షం కురిపించాడు. 285 పరుగుల లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(185 నాటౌట్: 123 బంతుల్లో 21 ఫోర్లు, 7సిక్సర్లు) అద్భుత శతకంతో మెరవడంతో ముంబై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(75) అర్ధసెంచరీతో ఆకట్టుకోవడంతో ముంబై లక్ష్యాన్ని 41.5 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లకు 284 రన్స్ చేసింది. సామర్థ్ వ్యాస్(90 నాటౌట్), విశ్వరాజ్ జడేజా(53), చిరాగ్ జానీ(53 నాటౌట్) రాణించారు.