ముషీరాబాద్, మార్చి 5: ట్రాఫిక్ చిక్కులు తెచ్చిపెడుతున్న అశోక్నగర్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దశాబ్ద కాలంగా నిధుల కేటాయింపులు లేక ప్రతిపాదనలకే పరిమితమైన విస్తరణ పనులను వచ్చే నెల లో చేపట్టడానికి కసరత్తు చేస్తున్నారు. ఇటీవల వీఎస్టీ-లోయర్ ట్యాం క్బండ్ మార్గంలో స్టీలు వం తెన నిర్మాణ పనులు చేపడుతున్న అధికారులు అశోక్నగర్ బ్రిడ్జ్(హుస్సేన్ సాగర్ నాలాపై) స్టీలు వంతెన నిర్మాణం తో పాటు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని విస్తరించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియ చేపట్టిన టౌన్ప్లానింగ్ అధికారులు బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న భవనాలను తొలగించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు.
అశోక్నగర్ బ్రిడ్జికి రెండువైపులా నాలాపై ఒక్కో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి అనువుగా దాదాపు తొమ్మిది అడుగుల మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం ఐదు భవనాలను తొలగించాల్సి ఉ న్న నేపథ్యంలో సదరు భవన యాజమానులతో అధికారులు సమావేశమై చర్చించారు. త్వరలో మారో సారి చర్చించి స్థల సేకరణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా అశోక్నగర్ నుంచి ఇందిరాపార్కు వైపు విస్తరణ పనులు చేట్టి బ్రిడ్జి నిర్మాణం చేపడతారు. పక్కనే ఉన్న భవనాన్ని తొలగించగానే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ప్రాజెక్టు డివిజన్ ఇంజినీరింగ్ అధికారులు చెప్తున్నారు. మరో వైపు భవనాల తొలగింపుకు సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిన టౌన్ప్లానింగ్ అధికారులు వారి నుంచి అనుమతి రాగానే భవన యాజమానులకు పరిహారం చెల్లించి పనులు చేపడతామంటున్నారు.
ప్రస్తుతం చేపడుతున్న స్టీలు వంతెన నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా ముందుగా బ్రిడ్జి వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అశోక్నగర్ నాలా వద్ద అటు స్టీలు వంతెన నిర్మాణ పనులకు, ఇటు ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చూస్తారు.
అశోక్నగర్ నాలా వద్ద రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే భవన యజమానులతో చర్చించాం. పలువురు విస్తరణ పరిధి తగ్గించాలని, పరిహారం ఎక్కువగా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటాం. -దేవేందర్, టౌన్ప్లానింగ్ అధికారి, సర్కిల్-15