Leukaemia : లండన్కు చెందిన 13 ఏళ్ల అలిస్సా టీ- సెల్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాతో బాధపడుతోంది. ఇది చాలా అరుదైన వ్యాధి. మందులకు లొంగని ఆ క్యాన్సర్ను లండన్ వైద్యులు అరుదైన చికిత్సతో నయం చేశారు. టీ-సెల్ ఇంజనీరింగ్ థెరపీతో ట్రీట్మెంట్ చేసి జబ్బును నయం చేశారు. దాంతో, ప్రపంచంలోనే టీ-సెల్ ఇంజనీరింగ్ థెరపీ తీసుకున్న మొదటి వ్యక్తిగా అలిస్సా గుర్తింపు సాధించింది. లండన్లోని గ్రేట్ ఒర్మాండ్ స్ట్రీట్ ఆస్పత్రికి చెందిన వైద్యులు అలిస్సాకు ట్రీట్మెంట్ చేశారు. ఆమె శరీరంలోని టీ-సెల్స్లోని జన్యువులను మార్చి, వాటిని క్యాన్సర్ సోకిన టీ-సెల్స్ను చంపేలా చేశారు. అలా ల్యూకేమియా కణాలను అలిస్సా శరీరం నుంచి తొలగించారు.
లండన్లోని లీసెస్టర్లో ఉండే అలిస్సాకు టీ- సెల్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ఉన్నట్లు 2021లో వైద్యులు గుర్తించారు. అయితే, అప్పటికే ఆమెకు క్యాన్సర్ చివరి దశలో ఉంది. కీమోథెరపీ, బోన్మ్యారో చికిత్స అందించినా అలిస్సా కోలుకోలేదు. దాంతో, మొదటిసారిగా మార్చిన టీ-సెల్ కణాలతో చికిత్స అందించారు. ఆరు నెలల తర్వాత డాక్టర్లు అలిస్సాకు పరీక్షలు చేశారు. ల్యూకేమియా పూర్తిగా తగ్గిపోవడం గమనించారు. అయితే.. ఆమెను మరిన్ని రోజులు పర్యవేక్షించనున్నారు. ఈ థెరపీతో భవిష్యత్లో మరింత మంది చిన్నారులను ప్రాణాంతకైమన జబ్బుల నుంచి కాపాడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు.