ఆరోగ్యమే మహాభాగ్యం. శైశవం నుంచి వృద్ధాప్యం వరకూ ప్రతి దశలోనూ ఆరోగ్యం ప్రధానమైంది. చాలా అనారోగ్య సమస్యలు చిన్నగా ప్రారంభం అవుతాయి. సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల, గుర్తించినా అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాంతకంగా మారుతాయి. పిల్లలకు సాధారణంగా వచ్చే సమస్యల గురించి కొంతమంది తల్లి దండ్రులకు సరైన అవగాహన ఉండదు.
ఉష్ణ మండల దేశాల్లో ఎండకాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది. దీంతో, సహజంగానే శిశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో దాదాపుగా 10శాతం శిశువులకు ఒళ్లు వెచ్చబడి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. గది ఉష్ణోగ్రతను చల్లబరిచి, తడి గుడ్డతో బిడ్డ ఒళ్లంతా తుడవాలి. వదులైన కాటన్ దుస్తులు వేయాలి. తల్లిపాలు తరచూ తాగిస్తూ ఉండాలి. ఆరు నెలలు పూర్తిగా నిండే వరకు ఎండ కాలంలో కూడా నీరు తాగించకూడదు. జ్వరం మందులూ వేయకూడదు.
పసిబిడ్డల్ని వేడినుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే ఏసీ వేయించవచ్చు. గది ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి. కూలర్ వాడేవాళ్లు ఆ గాలి నేరుగా బిడ్డ మీద పడకుండా, గది మొత్తం చల్లబడేలా ఫ్యాన్ను ఒకటో నంబరు దగ్గర ఉంచాలి. ఈ రెండూ సాధ్యం కానప్పుడు గది పైభాగంలో ఉష్ణాన్ని పీల్చుకునే సున్నం వేయాలి. ద్వారాలకు, కిటికీలకు తెరలు వేలాడదీసి, వాటిని తరుచూ తడుపుతూ ఉండాలి. నేలమీద కూడా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. దీంతో గది వాతావరణం చల్లగా ఉంటుంది. బిడ్డ హుషారుగా ఆడుకుంటుంది, హాయిగా నిద్రపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సమస్య ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఒక వేళ ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గరే స్థిరంగా ఉంటూ, అసలు తగ్గకపోతే డాక్టరును సంప్రదించండి. నవజాత శిశువులకు సొంతవైద్యం చాలా ప్రమాదకరం.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి , పిల్లల వైద్య నిపుణులు