లక్ష రూపాయల జీతం. అయినా తక్కువనే భావన. మూడు పడకగదుల అపార్ట్మెంట్. ఇంకా ఇరుకిరుకుగా ఉందన్న ఆలోచన. మంచి హోదా. ఎదగాల్సినంతగా ఎదగలేకపోయామే అన్న అసంతృప్తి. ఇదంతా ఇంతకు ముందు లేదని కాదు కానీ, కరోనా సంక్షోభం తర్వాత మరింత ఎక్కువైందని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనికి సైకాలజిస్టులు ‘కొరత మనస్తత్వం’ అని పేరు పెట్టారు. మనసులో గూడు కట్టుకున్న అభద్రత కారణంగా రేపటికి, ఎల్లుండికి, వచ్చే వారానికి, వచ్చే నెలకు, రానున్న ఏడాదికి దాచుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ఆశ పెరుగుతున్న క్రమంలో మన వ్యక్తిత్వం, వివేకం, విచక్షణ తగ్గుతూ వస్తాయని అంటారు. ఇది దీర్ఘకాలంలో మానసిక వ్యాధిగా పరిణమించే ఆస్కారం ఉంది. ఆ ప్రభావం శరీరం మీద కూడా పడి అల్సర్స్కు, అధిక రక్తపోటుకు దారితీయవచ్చు.