దెబ్బ తగిలింది, ఓ బ్యాండ్ ఎయిడ్ అంటిస్తాం. గాయం పెద్దగా ఉంది, శుభ్రం చేసి దూదీ గాజుగుడ్డలతో కట్టు కడతాం. సమస్య అంతటితో ఆగిపోదు. నిజానికి చాలాసార్లు అక్కడినుంచే అసలు కష్టం మొదలవుతుంది. లోపల గాయం ఎంతవరకు మానుతోందో కూడా తెలియదు. మధుమేహం లాంటి సమస్యలు ఉంటే, లోలోపల ఏం జరుగుతోందో కూడా అర్థం కాదు. ఈ ఇబ్బందికి పరిష్కారాన్ని కనుగొన్నామని చెబుతున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఇందుకోసం ‘మెగ్నీషియం హైడ్రాక్సైడ్’తో రూపొందించిన పట్టీలను తయారుచేశారు. మన శరీరం మీద ఇన్ఫెక్షన్ కనుక పెరిగితే, ఈ పట్టీలలో చిన్నపాటి రసాయనిక చర్య జరుగుతుందట. దానివల్ల పట్టీ మీద అతినీలలోహిత కిరణాలు (యూవీ లైట్) పడితే, అది వెలుగుతుందట. అంటే కట్టును తొలగించకుండానే లోపలి పరిస్థితిని అంచనా వేయవచ్చు. గాయాలకు కట్టు కట్టడానికి
(డ్రెస్సింగ్) ఉపయోగించే పదార్థాల వ్యాపారం విలువే ఏకంగా 50 వేల కోట్ల రూపాయలు. ఇంత ఖర్చు అవుతున్నా ఫలితం అంతంత మాత్రమే! కానీ ఇప్పుడు అంతకంటే చాలా తక్కువ ఖర్చుతో… గాయాలను నియంత్రించే విజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తున్నది.