యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునః ప్రారంభానికి సిద్ధమైంది. అద్భుతమైన శిల్ప
సౌరభాలతో తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు..ఒద్దికగా పొదిగిన అందమైన కృష్ణరాతి శిలలు.. రాజసంగా కొలువుదీరిన సప్తరాజ గోపురాలు.. గర్భగుడి ముఖద్వారం, ధ్వజ స్తంభానికి బంగారు తొడుగులు.. ఇలా ప్రతి అంగుళం భక్తులు తన్మయత్వం చెందేలా, భక్తిభావం ఉప్పొంగేలా తీర్చిదిద్దిన ఆలయం అందరినీ ఆకట్టుకుంటున్నది. దాదాపు నిర్మాణ పనులన్నీ పూర్తి కాగా.. ఈ క్రమంలో ఆలయ ఉద్ఘాటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రి ఆలయ పనులను
పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి పునఃప్రారంభ తేదీలను సీఎం ప్రకటించనున్నారు.