వనపర్తి, ఆగస్టు5: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. గురువారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో టీఆర్ఎస్ నేత శివ తండ్రి, 9వ వార్డు కౌన్సిలర్ బాష్యానాయక్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మంత్రి తెలుసుకున్నారు. వెంటనే శివ ఇంటికి వెళ్లి, మల్టీస్పెషాలిటీ దవాఖానలో చికిత్స పొందుతున్న బాష్యానాయక్ తల్లిని పరామర్శించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ, విభూతి నారాయణ ఉన్నారు.
విద్యార్థినికి మంత్రి సన్మానం
వనపర్తి మండలంలోని రాజపేట గ్రామానికి చెందిన రఘువర్ధన్రెడ్డి కూతురు శ్రీవర్షిని ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో 150 మార్కులకుగానూ 124 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 113 ర్యాంక్, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విద్యార్థినిని మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలని మంత్రి కాంక్షించారు.