నారాయణపేట టౌన్, ఆగస్టు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే పథకాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారపరంగా, ఆర్థికంగా రాణించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మంగళవారం పట్టణంలోని శీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆండ్ ఇండస్ట్రీయల్ తెలంగాణ చాప్టర్(డీఐసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై ఆమె మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు అంబేద్కర్ ఆశించిన ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలన్నారు. మహిళలు ముందుకొచ్చి పురుషులతో సమానంగా స్వయం సంవృద్ధి సాధించాలన్నారు.
జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు వ్యాపారాలు నిర్వహించి ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఐసీసీఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు దాసరి అరుణ, ఉపాధ్యక్షుడు మునీందర్, జోనల్ కోఆర్డినేటర్ వెంకటయ్య, ఎస్సీ, ఎస్టీ డీజీఎం విష్ణుమూర్తి, ఎల్డీఎం ప్రసన్నకుమార్, కుసుమ, యాదమ్మ, హాజమ్మ, బ్యాంకు అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.