జోగులాంబ గద్వాల : రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం కేటీ దొడ్డి మండల పరిధిలో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గట్టు మండల ప్రజల చిరకాల వాంఛ అయిన ఎత్తిపోతల పథకం పనులు గజ్జలమ్మ గట్టు దగ్గర ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
గత పాలకులు గట్టు, కేటీ దొడ్డి మండలాలను ఎడారిగా మార్చారని ఎమ్మెల్యే విమర్శించారు. విద్య, వైద్యం, రవాణా సాగునీటి రంగాల్లో దేశంలోనే వెనుకబాటుకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.32 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్తో గట్టు, కేటీదొడ్డి, ధరూర్ మండలాల్లో 33 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందని వివరించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మున్సిపల్ చైర్మన్ కేశవ్, నాయకులు గట్టు తిమ్మప్ప, నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.