మహబూబ్నగర్, ఆగస్టు5: సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వెబినార్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఆన్లైన్లో పాల్గొని తమ తమ సమస్యలతోపాటు పలు విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వందశాతం మొక్కలు నాటి జిల్లాలో పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల వెంట నర్సరీల నుంచి పెద్ద మొక్కలు తెచ్చి నాటడంతోపాటు మధ్య దూరం వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ప్రతి ఇంటి ముందు ఐదు మొక్కలు, ప్రతి మండల, జిల్లా కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలన్నారు. ప్రధానంగా పత్తికి డిమాండ్ అధికంగా ఉన్నదని, ఈ పంట సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై మరింత అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. నీటి నిల్వలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్ల లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయాలని ఆదేశించారు. కొవిడ్ వల్ల అనాథలైన పిల్లల వివరాలను సేకరించాలని, బాలికలు, బాలురకు వేర్వేరుగా హాస్టల్ వసతితోపాటు విద్య అందించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో చెరువుల కబ్జాలు, ఆక్రమణలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్కు సూచించారు.
ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం : కలెక్టర్ వెంకట్రావు
అభివృద్ధికి సంబంధించిన అంశంలో ప్రతి అధికారి, ప్రజాప్రతినిధులకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలు ప్రతిక్షణం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి, జెడ్పీటీసీలు, పలు సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.