మహబూబ్నగర్ సెఫ్టెంబర్ 15: కరోనా వైరస్ నివారణలో భాగంగా 18ఏండ్లు నిండిన వారందరికీ గురువారం నుంచి పూర్తిస్థాయిలో యుద్ధప్రతిపాదికన వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లోనూ వ్యాక్సిన్ కేంద్రాలను గుర్తించి అవసరమైన సదుపాయాలను కల్పించాలని సూచించారు. రైతువేదికలను కూడా ఉపయోగించుకోవాలని, వీలనైంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. గురువారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు, సంబంధింత అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు, షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. గ్రామా ల్లో పూర్తిస్థాయిలో బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం సంబంధింత అధికారులతో కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ను పకడ్బందీగా అమలు చేయాలని, సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేయాలని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయినందుకుగానూ కేక్కట్ చేశారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్, డీఎంహెచ్వో కృష్ణ, డీఐవో శంకర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో జ్యోతి, తాసిల్దార్లు, మండల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు తదితరులు హాజరయ్యారు.