మరికల్, జూలై 13: మండలకేంద్రంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక గజ్జలమ్మ ఆలయంలో ముందుగా ముదిరాజ్లు బోనాలు సమర్పించారు. అనంతరం పోచమ్మతల్లికి బోనాలు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించారు. బోనాల పండుగ సందర్భంగా పోతురాజులు ప్రజలను ఆకట్టుకున్నారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి ఆమ్మవారికి బోనంతో మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా మండలంలోని తీలేరు, అప్పంపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఉదయం మండలకేంద్రంలో పోచమ్మతల్లి విగ్రహంతో కుర్వ యాదవులు ఊరేగింపుగా వెళ్లారు. అంబలి నైవేద్యాన్ని ఆమ్మవారికి సమర్పించి గొర్రెల మంద వద్దకు నైవేద్యం తీసుకెళ్లి చల్లడంతో ఆమ్మవారు గొర్రెలకు రక్షణగా ఉంటుందని నమ్మకం. కార్యక్రమంలో సర్పంచ్ కస్పే గోవర్ధన్, ఎంపీటీసీ సుజాత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ధన్వాడ మండల కేంద్రంలో..
ధన్వాడ, జూలై 13: మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో గ్రామంలో ఊరేగింపు వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. పోతురాజు విన్యాసంతో ఉత్సాహంగా పండుగను జరుపుకొన్నారు. ఉదయం అమ్మవారికి అంబలితో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పురవీధులగుండా నృత్యాలు చేస్తూ అమ్మవారి సన్నిధికి ఊరేగింపుగా వెళ్లారు. కార్యక్రమంలో నీరటి నర్సింహులునాయుడు, చెట్టుకింది రమేశ్, రాంచంద్రయ్య, వెంకటయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.