ఆత్మకూరు, సెప్టెంబర్ 14: ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలిచే జూరాల ప్రాజక్ట్కు పర్యాటక శోభవచ్చింది. ఏండ్లుగా ప్రాజక్ట్ పరిసరాలు అభివృద్ధికి నోచుకోని తరుణంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో అభివృద్ధికి తొలి అడుగుపడింది. ప్రాజక్ట్కు కుడి వైపున గార్డెన్(పార్క్) నిర్మాణానికి ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం తదితరులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ప్రణాళిక చిత్రావళిని మంత్రి వీక్షించారు. టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జూరాలను అద్భుత పర్యాటకంగా తీర్చిదిద్దాలని సూచించారు.
అంతకుముందు పార్కు నిర్మాణ ప్రాంతంలో వేదపండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. 14ఎకరాల్లో మొదటిదశ పనులను రూ.15కోట్లతో అత్యాధునిక వసతులతో గార్డెన్ నిర్మించేందుకు పనులు ప్రారంభించనున్నట్లు టూరిజం శాఖ ఎండీ మనోహర్రావు తెలిపారు. మళిదశ పనుల్లో దాదాపు 70 ఎకరాల్లో జూరాలను గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఈ అశోక్కుమార్, డీఈఈ హనుమంతురెడ్డి, ఏఈఈ కల్యాణ్రెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరయ్యారు.