బాలానగర్, జూలై 13: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధ్యానం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తుంది.. కానీ, ఇదే అదునుగా భావించిన కొందరు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. తిరిగి దొడ్డిదారిన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లులను ఏ ఒక్కరూ కూడా తనిఖీ చేయకపోవడంతో యథేచ్ఛగా దందా కొనసాగుతున్నది. యాసంగిలో సేకరించిన ధాన్యం ఇప్పటివరకు రైస్ మిల్లులలోనే ఉండిపోయింది. వానకాలం ధాన్యం కూడా మిల్లుల్లో నిల్వ ఉన్నది. ఇప్పటికే టన్నుల కొద్ది బయటి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమాలకు అంతే లేదు
మిల్లర్లు బియ్యాన్ని గోదాంలోనే ఉంచి కాగితాలు మాత్రమే అటు ఇటు తిప్పుతున్నారు. సివిల్ పోలీసులే అధికంగా పీడీఎస్ బియ్యం పట్టుకొని కేసులు చేస్తున్నారు తప్ప సివిల్ సప్లయి అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు. నిఘా విభాగం పట్టింపు కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో రైస్మిల్లులకు లైసెన్స్ లేకుండాదందా కొనసాగుతుంది. తప్పనిసరిగా మార్కెట్శాఖ నుంచి లైసెన్స్ తీసుకుంటేనే అనుమతి పొందాల్సి ఉంది. అవేమీ పట్టనట్లుగా కొందరు ఇష్టానుసారంగా దందా కొనసాగిస్తున్నా.. మార్కెట్శాఖ పట్టించుకోవడంలో అంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైస్మిల్లులో అక్రమదందా నడిస్తుంటే సంబంధితశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినుట్లుగా వ్యవహరిస్తున్నారు. రైస్ మిల్లులకు తప్పనిసరిగా లైసెన్స్లు ఉండాలని మార్కెట్శాఖ నుంచి ఆదేశాలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఇష్టంవచ్చినట్లుగా కొందరు రైస్మిల్లుల యజమానులు వ్యవహరిస్తున్నారు. గతంలో మార్కెట్ శాఖ అధికారులు రైస్ మిల్లులను తనిఖీ చేసిన సందర్భంలో తప్పనిసరిగా లెసెన్స్లు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటివరకు ఏ ఒక్కరూ కూడా లెసెన్స్ లేకుండా దర్జాగా దందా కొనసాగిస్తున్నారు.
రైస్ మిల్లులలో కొందరైతే మొక్కజొన్న నిల్వ ఉంచుతున్నారు. మండలంలోని ఆరు రైస్మిల్లులు ఉండగా ఇద్దరు మాత్రమే లైసెన్స్లు తీసుకున్నారు. రైస్మిల్లులో రికార్డులు ఉండవు, స్టాక్ రిజిస్టర్లు చూపించరు. రైతుల నుంచి తీసుకున్న వరిధాన్యానికి సంబంధించిన రికార్డులు చూపించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరయితే తమకు ఇష్టం వచ్చినట్లు రైస్మిల్లుల దందాను కొనసాగిస్తున్నా.. సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్శాఖ అధికారులు తనిఖీలు చేసినా పట్టించుకోకుండా దర్జాగా రైస్మిల్లుల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైస్మిల్లులను తనిఖీ చేసి రికార్డులను, లైసెన్స్లను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
రైస్మిల్లులకు లైసెన్స్ తప్పనిసరి
మండలంలోని రైస్మిల్లుల యజమానులు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. మిల్లుల్లో ఉన్న స్టాక్ తదితర వివరాలను చూపించాలి. గతంలో రైస్మిల్లుల యజమానులకు లైసెన్స్లు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా ట్రేడింగ్ లైసెన్స్, ప్రాసెసింగ్ లైసెన్స్ తీసుకోవాలి.