జడ్చర్ల, ఆగస్టు 11 : తెలంగాణ వచ్చాక జడ్చర్ల ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీలోని పోచమ్మ ఆల య ఆవరణలో ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కావేరమ్మపేటలో వైకుంఠధామం ప్రారంభించి మొక్కలు నాటారు. హౌసింగ్బోర్డు కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో జడ్చర్ల అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందని, ప్రస్తుతం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదన్నారు. 70ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేండ్లలోనే చేశామన్నారు. రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు పట్టణం సుందరంగా తయారైందన్నారు. పట్టణంలో దాదాపు 20కిపైగా పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే గ్రీనరీ, ఆటవస్తువులు ఏర్పా టు చేస్తామని చెప్పారు. బాదేపల్లి పెద్దగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, అందుకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పెద్దగుట్ట రంగనాయకస్వామి ఆలయం వరకు సీసీరోడ్డు నిర్మించినా గుట్టపై పనులు చేస్తున్నందున భక్తులు కాలినడకన పైకి వెళ్లాలని సూచించారు. ఇందుకోసం గుట్ట కింద చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిగ్నల్ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే వెంకటేశ్వర కాలనీలో మురుగుకాల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మ య్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కమిషనర్ సునీత, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, జ్యోతి కృష్ణారెడ్డి, రాజు, లత, శశి, సతీశ్, మహేశ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జంగయ్య, శివదర్శన్, యాదిరెడ్డి, దోరేపల్లి రవీందర్, శేఖర్రెడ్డి, బీకేఆర్, మురళి, మాలిక్షాకీర్, కిరణ్, మాజీ వార్డుసభ్యులు జగదీశ్వరాచారి, మహేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.