నారాయణపేట టౌన్, జూలై30: సమాజంలో పిల్లల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బాల అదాలత్ కార్యక్రమానికి శ్రీనివాసరావుతో పాటు సభ్యులు దేవయ్య, రాగజ్యోతి, బృందాధరరావు, శోభారాణి హాజరై బాలల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఆర్థిక వనరులపరంగా నారాయణపేట జిల్లా వెనుకబడిందన్నారు. జోగిని, బాల కార్మికులు, బాల్య వివాహాలు వంటి రుగ్మతలు ఉన్నందునా ఇక్కడి పిల్లల సమస్యలు తెలుసుకునేందుకు అదాలత్ను ఏర్పాటు చేశామన్నారు. పిల్లల హక్కులు కాపాడడానికి తల్లిదండ్రులతో పాటు జిల్లా యంత్రాంగం, పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. బాల అదాలత్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
పిల్లల హక్కులపై అవగాహన కల్పించేందుకు బాలల హక్కుల పరిరక్షణ కమిటీతో పాటు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని కలెక్టర్ హరిచందన స్పష్టం చేశారు. జిల్లా మౌలిక రంగంలో వెనుకబడినప్పటికీ జిల్లాలో పిల్లలకు దక్కాల్సిన హక్కులు, నాణ్యమైన విద్య, క్రీడలు, ఆహ్లాదం తదితర సదుపాయాలు కల్పించేందుకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పిల్లల హక్కులను హరిస్తున్న వారి పట్ల పోలీస్శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ చేతన పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ తదితర కార్యక్రమాల్లో పోలీస్ శాఖ చురుకైన పాత్ర వహించి బాధ్యులపై కేసులు పెడుతున్నామన్నారు. అనంతరం పోస్టర్లు విడుదల చేశారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకట్రామ్, సంక్షేమ అధికారి వేణుగోపాల్, సీడబ్ల్యూసీ అధ్యక్షుడు అశోక్శ్యామల, డీసీపీవో కుసుమలత, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.