మహబూబ్నగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని పది జిల్లాలను 33కు పెంచిన ప్రభుత్వం.. తర్వాత రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య కూడా పెంచింది. దీంతో ప్రజలకు పరిపాలన వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని గండీడ్ నుంచి ఇటీవలే కొత్త మండలంగా మహ్మదాబాద్ ఏర్పడగా.. రెండు రోజుల కిందట నారాయణపేట జిల్లాలో కోస్గి నుంచి గుండుమాల్, మద్దూరు నుంచి కొత్తపల్లి మండలాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 14 నియోజకవర్గాలు, 64 మండలాలు ఉండగా.. విభజన తర్వాత కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటయ్యాయి. మొత్తం ఐదు జిల్లాల పరిధిలో ఎనిమిది రెవెన్యూ డివిజన్లు, 75 మండలాలు ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లుండగా.. మిగతా నాలుగు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ చొప్పున ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్ల ప్రక్రియ సైతం పూర్తయింది. ఉమ్మడి జిల్లాను జోగుళాంబ జోన్గా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా, జోన్, మల్టీ జోన్ల పరిధిలో ఉద్యోగాల నియామక ప్రక్రియకు సైతం మార్గం సుగమమైంది.
అప్పుడు 64.. ఇప్పుడు 75..
పాత మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్, తలకొండపల్లి, మాడ్గుల, షాద్నగర్ నియోజకవర్గం మొత్తం (షాద్ నగర్, కేశంపేట, కొందుర్గు, కొత్తూరు) మండలాలను రంగారెడ్డి జిల్లా పరిధిలో విలీనం చేశారు. జిల్లాలు, మండలాల విభజన సమయంలో పాత రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని గండీడ్ మండల ప్రజలు తమకు మహబూబ్నగర్ చేరువలో ఉందని.. అందుకే మహబూబ్నగర్ జిల్లాలో విలీనం చేయాలని పోరాటం చేశారు. ఫలితంగా గండీడ్ మహబూబ్నగర్ జిల్లాలోకి వచ్చింది. అలాగే మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో కొత్తగా ఐదు చొప్పున, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల పరిధిలో నాలుగు చొప్పున, జోగుళాంబ గద్వాల జిల్లాలో కొత్తగా మూడు మండలాలు ఏర్పడ్డాయి. మొత్తంగా పాత మహబూబ్నగర్ జిల్లాలో 64 మండలాలు ఉండగా.. ఇప్పుడు ఐదు జిల్లాల పరిధిలో 75 మండలాలు ఉన్నాయి.
చేరువైన పాలన..
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. ఎక్కడో సుదూరంగా ఉండే మద్దిమడుగు, సింధనూరు, నందిన్నె తదితర గ్రామాల నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చేవారు. ఇప్పుడు ఎక్కడికక్కడే జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు కార్యాలయాలు, అధికారులు చేరువయ్యారు. సీఎం కేసీఆర్ ఆది నుంచి చెబుతున్నట్లుగానూ పరిపాలన దగ్గరైంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగనున్నది.
జిల్లాల విభజన, కొత్త మండలాల ఏర్పాటు
తర్వాత ఉమ్మడి జిల్లా స్వరూపం..
జోగుళాంబ గద్వాల : మండలాలు 12
పాతవి : గద్వాల, ధరూరు, గట్టు, మల్దకల్, అలంపూర్,
ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ (9)
కొత్తవి : రాజోళి, ఉండవెల్లి, కేటీదొడ్డి (3)
నారాయణపేట : మండలాలు 13
పాతవి : నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మద్దూరు, కోస్గి, మక్తల్, మాగనూరు, నర్వ, ఊట్కూరు (9)
కొత్తవి : కృష్ణ, మరికల్, గుండుమాల్, కొత్తపల్లి (4)
మహబూబ్నగర్ : మండలాలు 16
పాతవి : మహబూబ్నగర్, హన్వాడ, కోయిలకొండ,
దేవరకద్ర, సీసీకుంట, అడ్డాకుల, భూత్పూర్, జడ్చర్ల,
మిడ్జిల్, బాలానగర్, నవాబ్పేట (11)
కొత్తవి : మహబూబ్నగర్ అర్బన్, రాజాపూర్,
మూసాపేట, గండీడ్, మహ్మదాబాద్ (5)
నాగర్కర్నూల్ : మండలాలు 20
పాతవి : అచ్చంపేట, బల్మూరు, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, వంగూరు, కల్వకుర్తి,
వెల్దండ, నాగర్కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట, కొల్లాపూర్, కోడేరు,
పెద్దకొత్తపల్లి (16)
కొత్తవి : పదర, ఉర్కొండ, పెంట్లవెల్లి,
చారగొండ (4)
వనపర్తి : మండలాలు 14
పాతవి : వనపర్తి, పెబ్బేరు, గోపాల్పేట, పెద్దమందడి, ఖిల్లాఘణపురం,
వీపనగండ్ల, పాన్గల్, కొత్తకోట,
ఆత్మకూరు (9)
కొత్తవి : రేవల్లి, శ్రీరంగాపూర్, అమరచింత, మదనాపురం,
చిన్నంబావి (5)
చాలా సంతోషంగా ఉన్నది..
మద్దూర్ మండలంలో 49 గ్రామాలు ఉండడంతో పరిపాలన కష్టంగా మారింది. అధికారులకు సైతం తలనొప్పిగా ఉండేది. కాగా, మద్దూర్ను రెండుగా విభజించి నూతనంగా కొత్తపల్లి మండలం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. చిన్న మండలంలో అధికారులు అందరికీ అందుబాటులో ఉంటారు. పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
మా కల నెరవేరింది..
గుండుమాల్ను మండలంగా చేయాలని తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆకాంక్షించాం. మా కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. గుండుమాల్ మండలం కావడం చాలా సంతోషంగా ఉన్నది.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మా దగ్గర ఏర్పడితే ప్రజలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం. – కన్నారావు, గుండుమాల్ మండలం
పనులు సులువుగా అవుతున్నాయి..
గండీడ్ నుంచి విడిపోయి నూతనంగా మహ్మదాబాద్ మండలం ఏర్పాటు కావడంతో ప్రభుత్వ కార్యకలాపాలు సులువుగా జరుగుతున్నాయి. జిల్లాలో గండీడ్ మండలం 49 గ్రామాలతో అతి పెద్దదిగా ఉండేది. పనులు త్వరగా అయ్యేవి కావు. చాలా వరకు పెండింగ్లో ఉండేవి. నూతన మండలం కావడంతోపాటు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండడంతో అధికారులు సకాలంలో కార్యాలయాలకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.