వనపర్తి నూతన కలెక్టరేట్కు కార్యాలయాల తరలింపు
శాఖల వారీగా గదులు కేటాయింపు
కలెక్టర్, మంత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు
వనపర్తి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో ప్రారంభించిన నూతన కలెక్టరేట్లో జిల్లా కార్యాలయాలు త్వరలో కొలువుదీరనున్నాయి. ఒక్కో శాఖ విభాగాధిపతికి ఒక్కో చాంబర్ కేటాయించారు. కలెక్టర్, మంత్రి కోసం ప్రత్యేకంగా చాంబర్ ఏర్పాటు చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ హాల్, పేషీ, విజిటర్స్ హాల్ వంటివి నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లకు కలెక్టరేట్ ఆవరణలోనే నివాస గృహాలు ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్లో శాఖల వారీగా గదులకు నెంబర్లు కేటాయించి, నేమ్బోర్డులు బిగించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో అక్కడక్కడ ఉన్న అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేస్తుండగా.., ప్రభుత్వ భవనాల్లో ఉన్న వాటిని సొంత శాఖలకు అప్పగించి నూతన కలెక్టరేట్కు తరలిస్తున్నారు. ఆర్అండ్బీ ఈఈ ఆఫీసును జిల్లా కోర్టుకు కేటాయించారు. ఎస్పీ కార్యాలయాన్ని ఇరిగేషన్ గెస్ట్హౌస్గా మార్చారు. సొంత భవనాలు ఉన్న శాఖల కార్యాలయాల్లోకి.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న డివిజన్ స్థాయి కార్యాలయాలు మారనున్నాయి. సబ్ట్రెజరరీ, డీఈవో, ఫారెస్టు కార్యాలయాలు ఖాళీ కానున్నాయి. ఈ ప్రక్రియ అంతా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది.
కార్యాలయాల కేటాయింపు ఇలా..
నూతన కలెక్టరేట్లోని గ్రౌండ్ఫ్లోర్లో ప్రజలతో నేరుగా సంబంధం ఉండనున్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖలు, పంచాయతీ అధికారి కార్యాలయాలకు కేటాయించారు. పెన్షనర్లు, దివ్యాంగులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీపీవో కార్యాలయం ఎదురుగా జిల్లా ప్రజా సంబంధాల అధికారికి గదులు కేటాయించారు. ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి కార్యాలయం, సమావేశ మందిరం, ఉద్యోగులు భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ ఉన్నది. లిఫ్ట్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ఫ్లోర్లో అగ్రికల్చర్, ఉద్యానవన శాఖ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ, బీసీ డెవలప్మెంట్, ఎక్సైజ్శాఖ, డీఆర్డీవో, సివిల్సప్లయ్, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, డీఎంహెచ్వో, ఆడిట్శాఖ, హార్టికల్చర్, ఎండోమెంట్, ఫిషరీస్, ఆర్డబ్ల్యూఎస్, అటవీశాఖ, డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీస్, సీఈవో కార్యాలయాలకు కేటాయించారు. ఇరిగేషన్, డీటీవో, ఆర్అండ్బీ కార్యాలయాలు నూతన కలెక్టరేట్లో ఉండడం లేదు. ఇదిలా ఉండగా.. క్షేత్రస్థాయి పర్యటన, మండల సమావేశాల పేరుతో విధులకు ఎగనామం పెట్టే జిల్లా అధికారులు సమీకృత కార్యాలయాల విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. ఒకేచోట ఉండడంతోపాటు కలెక్టరేట్కు వచ్చిన తరువాతే ఫీల్డ్కు వెళ్లే అవకాశం ఉన్నందున నిర్ణీత సమయానికి రావల్సి ఉంటుంది. నిరంతరం పర్యవేక్షణ ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని, కావున తమ కార్యాలయాలను తరలించొద్దని పలువురు అధికారులు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ను వేడుకున్నట్లు తెలిసింది. కాగా, ఒకేచోట కార్యాలయాలు ఉండడంతో తమకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.