మహబూబ్నగర్ సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాలానగర్ మండలం తిరుమలగిరికి చెందిన సుజాతకు 12ఏండ్ల కిందట భర్త మరణించాడు. ఇద్దరు పిల్లలు, అత్త ఉన్నారు. వీరికి ఉన్న పాత మట్టిమిద్దె రెండేండ్ల కిందట కూలిపోయింది. ఆ తర్వాత ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. ఎండావాన, చలికి తట్టుకకోలేక కొంతకాలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్నారు. ఆ తర్వాత రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుందని పంచాయతీ సిబ్బంది చెప్పడంతో అక్కడినుంచి తిరిగి తమ పాడుబడిన ఇంటి వద్దకు వచ్చారు. అయితే ఉన్న కొద్దిపాటి వంట సామగ్రి, సామాను ఎక్కడ పెట్టాలో అర్థంకాక తమ ఇంటి వద్ద గతంలో నిర్మించిన మరుగుదొడ్డిలో ఉంచారు. వర్షం పడకుంటే మరుగుదొడ్డి బయట ఉండేవారు.
వర్షం పడితే గత్యంతరం లేక పిల్లాపాపతో మరుగుదొడ్డిలోనే కూర్చోవాల్సి వచ్చేది. వీరి కష్టాలు పగవారికి కూడా రాని విధంగా ఉండేవి. తమకు ఇల్లు కావాలని అడిగేందుకు ఎవరినీ కలువలేదు. ఈ నోట ఆ నోట విషయం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి వెళ్లింది. వెంటనే తిరుమలగిరి సర్పంచ్ కేస్లీబాయితో మాట్లాడి సుజాత సొంత స్థలంలో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. స్పందించిన సర్పంచ్ వెంటనే బాధితురాలితో మాట్లాడారు. శుక్రవారం ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో దీపావళి నాటికి ఇల్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఎమ్మెల్యే, సర్పంచ్కు కృతజ్ఞతలు
నా భర్త పన్నెండేళ్ల కిందట మరణించాడు. ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి నివసిస్తున్నా. మా పాత ఇల్లు రెండేండ్ల కిందట కూలిపోయింది. గత్యంతరంలేక కొంతకాలం గ్రామ పంచాయతీలో నివసించాం. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి వచ్చేశాం. ఎక్కడ ఉండాలో తెలియక ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్డిలోనే సామన్లను ఉంచి అక్కడే ఉంటున్నాం. వానకాలంలో మేమందరం రాత్రింబవళ్లు కూర్చోనే ఉండాలి. కనీసం నిలబడేంత జాగా లేదు. మరుగుదొడ్డిలో మేం పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సర్పంచ్ కేస్లీబాయి స్పందించి మాకు సొంతిళ్లు నిర్మించేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం ముగ్గుపోసి పనులు చేపట్టారు. మాకు అండగా నిలిచిన ఎమ్మెల్యే, సర్పంచ్కు ప్రత్యేక కృతజ్ఞతలు. – సుజాత, తిరుమలగిరి
ఉచితంగా చదువు చెప్పిస్తాం
సుజాత దయనీయ స్థితిని గమనించి ఆదుకునేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో వారి సొంత స్థలంలో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. శుక్రవారం భూమిపూజ చేసి ప్రారంభించాం. దీపావళి నాటికి నిర్మాణం పూర్తిచేస్తాం. ఆమె ఇద్దరు పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తాం. వారికి అన్ని విధాలా అండగా ఉంటాం. గ్రామంలో ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభం కానందున వారి సొంత స్థలంలోనే ఇల్లు కట్టించి ఇస్తున్నాం. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తాం.
హామీ ఇచ్చిన నెలరోజులకే..
గతేడాది వాల్మీకి జయంతి సందర్భంగా జడ్చర్ల మండలం మాచారంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకున్న గ్రామానికి చెందిన జానకమ్మ ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నది. వారి పాత ఇల్లు వర్షాలకు కూలిపోగా.. మొండిగోడల మధ్యన ఓ కవర్ కప్పుకొని జీవిస్తున్నామన్నారు. ఇద్దరు పిల్లలు, బోదకాలుతో ఇంటికే పరిమితమైన భర్త ఉన్నారని, తాను కూలీ పని చేస్తే తప్ప తిండి కూడా దొరికే పరిస్థితి లేదని వివరిస్తూ బోరుమన్నది. ఆమె కన్నీటి గాథకు చలించిన ఎమ్మెల్యే కూలిపోయిన ఇంటి కప్పు నిర్మించేందుకు అంగీకరించారు. స్థానిక సర్పంచ్ రవీందర్రెడ్డికి చెప్పి నెల రోజుల్లోనే ఇంటి పైకప్పు వేయించి వారు నివసించేలా నిర్మాణం పూర్తిచేశారు. ఎండావాన, చలికి తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రస్తుతం వారు సంతోషంగా తమ ఇంట్లో జీవనం గడుపుతున్నారు.
మొండి గోడలకే పరిమితం
నా భర్తకు బోదకాలు ఉండడంతో ఏ పని చేసే పరిస్థితి లేదు. పాత ఇల్లు కూలిపోతే ఇద్దరు పిల్లలు, నా భర్త, నేను మొండి గోడల మధ్య నివాసం ఉండేవాళ్లం. వాల్మీకి జయంతి రోజున మా గ్రామానికి ఎమ్మెల్యే వస్తే నా బాధ ఆయనకు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాను. చలించిపోయి నెలరోజుల్లో ఇల్లు సిద్ధం చేసిస్తామని చెప్పిండు. అన్నవిధంగానే మా ఇంటికి కప్పు వేయించి నీడ కల్పించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సర్పంచ్ రవీందర్రెడ్డి, ఉపసర్పంచ్ రవికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఆపదలో ఆదుకున్నారు
మా గ్రామానికి చెందిన జానకమ్మ కుటుంబం ఇల్లు లేక పడుతున్న బాధను చూసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెంటనే స్పందించి సొంత డబ్బులతో ఇంటి పైకప్పు వేసేందుకు సాయం చేశారు. పేదలు కష్టాల్లో ఉన్నామంటే చలించే ఎమ్మెల్యే ఉండటం మా అదృష్టం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.