జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్లలోని ఆల్మాస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో రోజుకు వందమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు.అనంతరం హరితహారంపై మున్సిపల్ కమిషనర్ సునీతకు పలు సూచనలు చేశారు. మహబూబ్నగర్-జడ్చర్ల ప్రధాన రహదారికి ఇరువైపులా మొ క్కలు నాటించాలని ఆదేశించారు. సెంట్రల్ మీడియన్లో పెద్ద మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమం లో డాక్టర్లు శివకాంత్, సునీల్ పాల్గొన్నారు.
2,082మందికి వ్యాక్సిన్
మున్సిపాలిటీలో 2,082మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. 23, 9వ వార్డుల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి పరిశీలించారు. కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, చైతన్యచౌహాన్తో కలిసి ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పించారు. 19వ వార్డులో కౌన్సిలర్ సాజిదాసుల్తానా ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు వ్యాక్సిన్ వేశారు. కాగా, బూరెడ్డిపల్లిలోని వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోడీ ఫొటో లేదని బీజేపీ నాయకులు గొడవకు దిగారు. ఉన్నతాధికారులు పంపించిన మేరకు బ్యానర్లను ఏర్పాటు చేశామని వ్యాక్సినేషన్ సిబ్బంది చెబుతున్నా బీజేపీ నాయకులు రాద్దాంతం చేశారు. బీజేపీ నాయకుల తీరుతో వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు.
ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలి
రాజాపూర్, సెప్టెంబర్ 18 : కరోనాను ఎదుర్కొనేందుకు 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఎంపీడీవో లక్ష్మీదేవి పేర్కొన్నారు. శనివారం మండలంలోని కుచ్చర్కల్, తిర్మలాపూర్, రంగారెడ్డిగూడ గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
టీకాతోనే కరోనా దూరం
భూత్పూర్, సెప్టెంబర్ 18 : టీకాతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని పీహెచ్సీ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కమిషనర్ నూరుల్నజీబ్, సీహెచ్వో రామయ్య, ఏఎన్ఎం వెంకట్నర్సమ్మ పాల్గొన్నారు.
2,518మందికి వ్యాక్సిన్
హన్వాడ, సెప్టెంబర్ 18 : మండలంలో 2,518మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సుదర్శన్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.