మల్దకల్, సెప్టెంబర్18: జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం-చిప్పదొడ్డి మధ్య నిర్మించిన వంతెన కూలిపోయి 12ఏండ్లు గడుస్తున్నా.. నేటికీ నిర్మాణం పూర్తికావడం లేదు. గతంలో రూ.1.20కోట్లు ఆర్అండ్బీ నిధులతో అప్పట్లో విఠలాపురం నుంచి అయిజ మండలం వెంకటాపురం వరకు బీటీరోడ్ల నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో విఠలాపురం- చిప్పదొడ్డి మధ్య వంతెన నిర్మించారు. కాగా, 2009 సెప్టెంబర్- అక్టోబర్లో కురిసిన వర్షాలకు వంతెను కూలిపోయింది. వంతెనకు అయిజ నుంచే కాకుండా మల్దకల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి, మానవపాడు మండలం బొంకూర్ మీదుగా ఆలంపూర్లోని తుంగభద్రనదిలో వర్షపునీరు కలుస్తున్నది. భారీ వర్షాలకు ఈ వంతెనపైకి ఎక్కి రెండుమూడు రోజులు నీరు పారడం వల్ల వంతెన కూలిపొయింది.
ట్రాన్స్పోర్టుకు ప్రధాన రహదారి
గద్వాల నుంచి పాల్వాయి మీదుగా ఎల్కూర్, మల్లెందొడ్డి, విఠలాపురం నుంచి చిప్పదొడ్డి వంతెనపై వెంకటాపురం నుంచి రాయలసీమ కర్నూలు వరకు నిత్యం ప్రయాణికులు వెళ్తుంటారు. కొందరు కర్నూలుకు వ్యాపారం, వైద్యం కోసం, మరికొందరు వివిధ రకాల పనులపై వెళ్తుంటారు. అదేవిధంగా కర్నూలు నుంచి గద్వాలకు రావాలంటే ఆలంపూర్చౌరస్తా మీదుగా బొంకూర్, శాంతినగర్, వెంకటాపురం మీదుగా చిప్పదొడ్డి-విఠలాపురం మీదుగా పాల్వాయి నుంచి గద్వాలకు చేరుకోవచ్చు. దీంతో ట్రాన్స్పోర్టు వారికి దాదాపుగా 20నుంచి 25కి.మీ. దూరం తగ్గుతుంది. లేదంటే అటు గద్వాలకు రావాలంటే ఎర్రవల్లిచౌరస్తా మీదుగా గద్వాలకు, ఇటు రావాలంటే ఆలంపూర్ నుంచి అయిజ మీదుగా గద్వాలకు రావాలి. దీంతో 30, 40కి.మీ. దూరం చుట్టూ రావాల్సి ఉంటుంది.
30గ్రామాల ప్రజలకు ఇక్కట్లు
చిప్పదొడ్డి వంతెన కూలిపోవడంతో గద్వాల, మల్దకల్, ఇటిక్యాల, గట్టు తదితర మండలాల ప్రయాణికులు, వ్యాపారస్తులు నిత్యం ఇబ్బందులు ఎద్కుర్కొంటున్నారు. కేవలం ఈ వంతెన మీదుగా బైక్లు మాత్రమే ప్రయాణిస్తున్నాయి.