కేటీదొడ్డి, సెప్టెంబర్18: జోగుళాంబగద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామపరిధిలో నాలుగు తండాలు ఉన్నాయి. తండావాసులు గ్రామానికి రావాలంటే వాగు దాటుకొని రావాల్సిందే. వాగు కుచినేర్ల, నందిన్నె, గువ్వలదిన్నె, ఇర్కిచేడు గ్రామాల మీదుగా కృష్ణానదిలోకి ప్రవేశిస్తున్నది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే నెలరోజులపాటు వాగు భారీగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో తండావాసులు గ్రామానికి రాలేక, గ్రామంలోని రైతులు పొలాలకు వెళ్లలేని దుస్థితి.
బ్రిడ్జి నిర్మాణంతో కష్టాలకు చెక్
వాగులో భారీగా నీరు ప్రవహిస్తే తండావాసులు పనులకు వెళ్లకుండా అక్కడే ఉండేవారు. గువ్వలదిన్నె గ్రామ రైతులు కూడా పొలాలకు వెళ్లకుండా వాగులో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత పొలంబాట పట్టేవారు. ఒక్కో సమయంలో వాగుదాటే క్రమంలో గేదెలతోపాటు మనుషులు కూడా కొట్టుపోయిన సందర్భాలున్నాయి. ఈ కష్టాలకు తండావాసులు, రైతులు దూరమయ్యారు. రూ.2.47కోట్లతో 2019లో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికావడంతో నాగర్కర్నూల్ ఎంపీ రాములు 2019 డిసెంబర్ 24న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అప్పటినుంచి తండావాసులు, గువ్వలదిన్నె గ్రామస్తుల కష్టాలు తొలగిపోయాయి.