భూత్పూర్, సెప్టెంబర్16: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కేంద్ర హరిత ట్రిబ్యునల్ బృందం గురువారం పరిశీలించారు. కమిటీ ఎస్ఈ నర్సింగారావు, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి భట్టుపల్లి శివారులోని 13వ ప్యాకేజీలోని ప్రతిమ కంపెనీలో ఎత్తిపోతలకు సంబంధించి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎత్తిపోతల పథకాల్లోని పలు అంశాలను చర్చించి, పత్రాలను సేకరించారు. అనంతరం బృందం కట్ట వద్దకు వెళ్లి పనులను పరిశీలించింది. ఒండ్రుమట్టి, రాతి కట్టడం పనులను, నమూనాలను పరిశీలించారు. అనంతరం ఎస్ఈ నర్సింగారావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్నారని ట్రిబ్యునల్లో పిటీషన్ దాఖలు చేసినందున తనిఖీకి వచ్చినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం పిటీషన్లో పేర్కొన్నట్లుగా పర్యావరణం ఎక్కడా దెబ్బతినే అవకాశం లేదని కమిటీ తేల్చింది. ఇదే నివేదికను కోర్టుకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, ఈఈ దయానంద్, మైనింగ్ ఏడీ విజయరామరాజు, ఆర్డీవో పద్మశ్రీ, డీఈ విజయేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సిద్దిఖ్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, ఏఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నసరుల్లాబాద్, పోలేపల్లి చెరువుల పరిశీలన
జడ్చర్ల, సెప్టెంబర్ 16: మండలంలోని నసరుల్లాబాద్ పెద్దచెరువు, పోలేపల్లి రంగనాయక చెరువులను గురువారం కేంద్ర పర్యావరణశాఖ అధికారులు పరిశీలించారు. అదేవిధంగా జడ్చర్ల, నవాబ్పేట, రాజాపూర్ మండలాల్లోని చెరువులను పరిశీలించారు. ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల తీరుపై ఆరా తీశారు. చెరువుల్లోని ఒండ్రుమట్టి తీయడం వల్ల నీళ్లు చెరువుల్లో ఉన్నాయా లేదా, లీకేజీ అవుతుందా అనే అంశాలపై వారు చెరువులను పరిశీలించారు. కేంద్ర బృందం వెంట కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీవో పద్మశ్రీ, ఇరిగేషన్ అధికారులు, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద..
నవాబ్పేట, సెప్టెంబర్ 16: మండలంలోని కారుకొండ శివారులో చేపడుతున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను కేంద్ర హరిత ట్రిబ్యునల్ బృందం గురువారం పరిశీలించింది. రిజర్వాయర్ నిర్మాణంతో పర్యావరణానికి ఇబ్బందులు వస్తాయని.. కోర్టులో కేసు దాఖలైన నేపథ్యంలో కేంద్ర హరిత ట్రిబ్యునల్ సభ్యులు అరోకియా లెనిన్, పూర్ణిమ, మేఘనాథన్, రమేశ్కుమార్, మంతాంగ్ తదితరులు రిజర్వాయర్ పనులు పరిశీలించారు. కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణం ఆవశ్యకతను వారికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. అనంతరం యన్మన్గండ్ల పెద్ద చెరువును సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువులో నల్లమట్టి తీయడం వల్ల రైతుల పొలాలు సారవంతమవ్వడమే కాకుండా.. చెరువులో నీరు అధికంగా నిల్వ ఉండే అవకాశం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.