జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేషన్జీ
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 21: పారిశుధ్య కార్మికులకు అన్యాయం జరిగినా, అధికారులు గానీ, కాంట్రాక్టర్గానీ వేధింపులకు గురి చేసినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేషన్జీ అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన, జిల్లా స్థాయి అధికారులతో కలిసి పారిశుధ్య కార్మికులు, సంఘం నాయకులతో కార్మికుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమం, సమస్యలు పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఉందన్న విషయాన్ని కార్మికులందరూ గుర్తించాలన్నారు. ఈ కమిషన్కు చాలా అధికారాలు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు అందితే సంబంధిత కాంట్రాక్టర్, అధికారిపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నదన్నారు. తాను చైర్మన్గా ఎన్నికైన నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు.
ప్రధాన మంత్రి లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని, ఇన్సూరెన్స్కు కట్టాల్సిన డబ్బులు చాలా చిన్న మొత్తం కాబట్టి జిల్లా యంత్రాంగం ద్వారా చెల్లించాలని కలెక్టర్ను కోరారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా పొందవచ్చన్నారు. కార్మికులు మ్యాన్హోల్లోకి వెళ్లరాదన్నారు. ఏ సమస్య ఎదురైనా పోర్టల్ ద్వారా లేదా తన మొబైల్ నెంబర్ 8841424629కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు, సంఘం నాయకులు వివిధ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించి కలెక్టర్, సంబంధిత అధికారులతో చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో 893 మంది పారిశుధ్య కార్మికులుగా మరికొందరు వాటర్మెన్, ఎలక్ట్రిషియన్లుగా పని చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఎస్పీ చేతన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఎస్పీ మధుసూదన్రావు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో మురళి, సివిల్ సైప్లె అధికారి శివప్రసాద్రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.