ప్రభుత్వ దవాఖానల్లో పెంచిన సర్కారు
పాలమూరు జనరల్ దవాఖానలో 500 పడకలు ఏర్పాటు
250 ఆక్సిజన్ పడకలు సిద్ధం
250 జనరల్ పడకల్లో వైద్య సేవలు
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వైద్య శాఖ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా వార్డులతోపాటు పడకల స్థాయిని కూడా పెంచారు. ఎక్కువ మంది రోగులు అడ్మిట్ అవుతున్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 150 పడకల కొవిడ్ హెల్త్కేర్ సెంటర్ ఉండగా.. దీనికి అదనంగా మరో 100 పడకలతోపాటు పాత మెడికల్ కళాశాల భవనంలో కూడా 250 పడకలు అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా ఐసీయూ, నిరంతరం ఆక్సిజన్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. 13 కేఎల్ పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ద్వారా 250 పడకలకు ఆక్సిజన్ అందిస్తున్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా 150 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం కొవిడ్ వార్డులో వందల మంది చికిత్స పొందుతున్నారు. కొందరు ఐసీయూలో ఉండగా, మరికొందరు జనరల్ వార్డులో ఉన్నారు. దవాఖానలో వైద్యసేవలు పొందుతున్న వారికి కావల్సిన 30 రకాల మందులు అందుబాటులో ఉంచారు. నిత్యం మూడు పుటలా భోజనం, డ్రైఫ్రూట్స్ అందిస్తున్నారు. కొవిడ్ వార్డులో ప్రత్యేకంగా 40 మంది వైద్యులు, 80 మంది స్టాఫ్ నర్సులు, 18 మంది నాలుగో తరగతి సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు ప్రైవేట్ దవాఖానల్లో (ఎస్వీఎస్, నవోదయ) కొవిడ్ చికిత్సనందిస్తున్నారు.
జనరల్ దవాఖానలో 500 పడకలు..
మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 500 పడకలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా హెల్త్కేర్ సెంటర్లోని 150 పడకలు, పాత మెడికల్ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన 250 పడకల్లో వంద పడకలకు ఆక్సిజన్ సేవలందిస్తున్నారు. దీంతో మొత్తం 250 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో అదనంగా మరో 250 పడకలు పెంచినట్లు దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్ తెలిపారు. గతేడాది జూలై నెలలో మంత్రి శ్రీనివాస్గౌడ్ 150 పడకలతో కరోనా హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. నిత్యం వందల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి దవాఖానలోని హెల్త్కేర్ వార్డులో అన్ని రకాల వసతులతో సేవలందిస్తున్నారు. 250 ఆక్సిజన్ సిలిండర్లు పడకలతోపాటు 47 వెంటిలెటర్ల సాయంతో అవసరమైనవారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే, మాస్క్ తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. భౌతికదూరం పాటించాలని, రద్దీ ప్రాంతాల్లో గుమిగూడొద్దని హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2,370 పడకలు..
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో రోగుల కోసం పడకల స్థాయిని పెంచారు. అన్ని దవాఖానల్లో కలిపి మొత్తం 2,370 బెడ్లు సిద్ధంగా ఉంచారు.