కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వితరణ
గద్వాల, మే 30: కరోనా కష్టకాలంలో కరోనా రోగుల కోసం ఆక్సిజన్ అందించడానికి దాతలు ముందుకురావడంతో కరోనా రోగుల్లో ఆనందం వెళ్లి విరుస్తున్నది. ఓ వైపు కరోనా కట్టడికి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుండగా ప్రభుత్వానికి అండగా కరోనా రోగులకు చేయూతగా మేమున్నామని ఆపన్న హస్తం అందిస్తున్నారు దాతలు. కరోనా రోగుల కోసం సహాయం అందిస్తున్న వారిలో ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకొచ్చి తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని దాతలు భావించకుండా వారికి ఉన్న దాంట్లో కరోనా రోగుల కోసం ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా దవాఖానలో రోగుల సంఖ్య పెరుగుతుండడం ఆక్సిజన్ సిలిండర్లు తక్కువగా ఉండడంతో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న దాతలు వారికి చేయూతనిచ్చి ప్రాణం పోసేలా తమవంతు సహకారం అందిస్తూ కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నారు జిల్లాలోని కొంతమంది దాతలు..
ఆక్సిజన్ సిలిండర్లు వితరణ
జిల్లా కేంద్రంలోని దవాఖానలో కరోనా బారిన పడి ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఆక్సిజన్ అందించాలనే మంచి ఆలోచనతో ఆర్యవైశ్య సంఘం నాయకులు రాము రెండు సిలిండర్లు, ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి రెండు సిలిండర్లు, మల్దకల్ పీఎసీసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, సంకాపురం రాముడు, రామచంద్రారెడ్డి, పెద్దొడ్డి రాముడు, నాగర్దొడ్డి వెంకట్రామిరెడ్డి, గట్టు ఈశ్వరయ్య జిల్లా దవాఖానకు 15 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు.
ఎస్బీఐ ఆధ్వర్యంలో..
కరోనా రోగులకు చేయూత నివ్వాలనే ఉద్దేశంతో ఎస్బీఐ వారు జిల్లా దవాఖానకు సుమారు రూ.5లక్షల విలువ చేసే ఐదు కాన్సన్ట్రేటర్స్ ను అందజేసి తమ ఉదారతను చాటుకుని కొవిడ్ రోగులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించారు. వీరితోపాటు అయిజకు చెందిన షెక్షావలి కాన్సన్ట్రేటర్ను అందజేశారు.
ఆక్సిజన్ ఫ్లో మీటర్లు
కరోనా ఒకవైపు మరో వైపు లాక్డౌన్ కొనసాగుతున్న వేళ దవాఖానలోని రోగులకు ఆక్సిజన్ ఫ్లోమీటర్లు అవసరం పడడంతో ఎమ్మెల్యే రూ.లక్షతో ఆక్సిజన్ ఫ్లో మీటర్లు అందజేశారు. అదేవిధంగా ధరూర్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ధరూర్ నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం వారి అల్లుడు రాఘవేంద్రరెడ్డి జిల్లా దవాఖానకు 24 సీసీ కెమెరాలు అందజేయడంతోపాటు సుమారు రూ.2లక్షల విలువల చేసే ఆక్సిజన్ ఫ్లో మీటర్లు జిల్లా దవాఖానకు సమకూర్చారు.
కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామానికి చెందిన సోమశేఖర్రెడ్డి కొవిడ్ బారిన పడి జిల్లా దవాఖానలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకోగా తనకు చేయూత నిచ్చిన డాక్టర్లతోపాటు కరోనా సోకిన వారికి హీట్ వాటర్ అందించాలనుకుని దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు తమవంతు సాయం అందించారు.