జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీ
ఎస్పీ రంజన్ రతన్కుమార్
గద్వాల న్యూటౌన్, మే 30: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలు, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటూ సర్టిఫైడ్ పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో జిల్లాలో నిరంతరం తనిఖీలు చేపడుతామన్నారు. లైసెన్సు కలిగిన వ్యాపారుల వద్దే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. గతేడాదిలో నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేశామన్నారు. వ్యాపారులు స్టాక్, లైసెన్సు, బిల్ బుక్కులను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. రైతులు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినా.. సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఆవసరమైతే పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ సూర్యానాయక్, సీసీఎస్ ఎస్సై నరేశ్కుమార్, పట్టణ ఎస్సై హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు.