అయిజ, ఏప్రిల్ 28 : నాగల్దిన్నె వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పులికల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నాగల్దిన్నె వంతెన పనులు, భూసేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీవో రాములతో కలిసి అదనపు కలెక్టర్ అధికారులు, రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాగల్దిన్నె వంతెన పనులు వంద శాతం పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అయిజ మండలం, పులికల్, రాజాపూర్ గ్రామాలకు చెందిన 16 మంది రైతులకు చెందిన 2.09 ఎకరాలను భూసేకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రైతులు ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ మేరకు నష్ట పరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. రైతుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన భూసేకరణను పూర్తి చేసి, ఆర్అండ్బీ అధికారులకు అప్పగించి పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో తాసిల్దార్ యాదగిరి, ఆర్ఐ మద్దిలేటి, సర్వేయర్ సందీప్, రైతులు పాల్గొన్నారు.