వైద్య శాఖ మంత్రి ఈటలను కోరిన ఎమ్మెల్యే బండ్ల
గద్వాల, ఏప్రిల్ 27 : కర్ణాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం, అటు రాయలసీమకు, ఇటు కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న నడిగడ్డపై ఆ ప్రభావం పడే అవకాశం ఉన్నదని, అందుకే గద్వాల దవాఖానను పూర్తిస్థాయిలో కరోనా దవాఖానగా మార్చాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రిని ఆయన కలిశారు. రాష్ట్రంతోపాటు తమ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ద్వారా రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గద్వాల వైద్యశాలలో పూర్తిస్థాయిలో కరోనా చికిత్సలు అందించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా బాధితులు అధైర్యపడొద్దని, ప్రజాప్రతినిధులు ధైర్యం చెప్పాలని సూచించారు. అన్ని దవాఖానల్లో కొవిడ్ పరీక్షలు పూర్తిస్థాయిలో చేయడంతోపాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ప్రతిఒక్కరూ టీకా వేయించుకునే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా విషయంలో జిల్లాకు ఎలాంటి సాయం కావాలన్నా అందజేస్తామని మంత్రి చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.