గద్వాల, జూన్ 24 : ఆర్డీఎస్లో మన వాటా 15.9 టీఎంసీలు ఉందని, అందులో చుక్క నీటిని కూడా వదులుకోమని జెడ్పీ చైర్పర్సన్ సరిత తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఆర్డీఎస్ ద్వారా పూర్తి స్థాయిలో నీరు అందక అలంపూర్ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ కుడికాలువ పనులు చేపట్టిందన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. అధిష్టానం ఆదేశిస్తే తమ ప్రాంతానికి వచ్చే నీటి వాటాను కాపాడుకోవడానికి ఉద్యమాలకైనా.. ధర్నాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో తుమ్మిళ్ల లిఫ్ట్ను కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసి సుమారు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించిందన్నారు. ప్రభుత్వం జమ చేసిన రైతుబంధు నగదును బ్యాంకర్లు క్రాప్లోన్ కింద తీసుకోవడం సరికాదన్నారు. రైతుబంధులో ఒక్క పైసా కూడా ముట్టొద్దని మంత్రి హరీశ్రావు ఆదేశించడంతో ఎంతో మేలు జరిగిందన్నారు. అలంపూర్ చౌరస్తాలోనే వంద పడకల దవాఖాన ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అలంపూర్ పురపాలక సంఘంలో ఉన్న దవాఖానను 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలని కోరుతానని చెప్పారు. కొవిడ్ నిబంధనల మేరకు వచ్చే నెల నుంచి తల్లిదండ్రుల అనుమతితో పిల్లలను పాఠశాలలకు పంపించాలన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనాథ్రెడ్డి, తిరుపతయ్య, పల్లయ్య తదితరులు పాల్గొన్నారు.