గద్వాల, జూన్ 24 : ప్రభుత్వ పథకాలకు నిర్ధేశించిన రుణాలను బ్యాంకర్లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శృతిఓఝా బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో వివిధ కార్పొరేషన్ల రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహాం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల కింద నిర్ధేశించిన రుణాలను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఉపాధి కల్పన కింద మంజూరు చేసిన రుణాలు అందరికీ ఇవ్వాలన్నారు. మహిళా అభివృద్ధికి ఎస్హెచ్జీ గ్రూపులకు నిర్ధేశించిన రీతిలో రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భంగా 2021-22 వార్షిక ప్రణాళికకు సంబంధించిన పుస్తకాన్ని కలెక్టర్ జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలతో కలిసి విడుదల చేశారు. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.3630.81కోట్లుగా నిర్ధేశించారు.
పంట రుణాలు రూ.2427.60కోట్లు, వ్యవసాయ పెట్టుబడి రుణాలు రూ.369.46కోట్లు, ఇతర రుణాలు రూ.833.75కోట్లు గా నిర్ధేశించారు. చిన్న, సన్నకారు రైతులకు కొత్త పంటరుణాలు బ్యాంకర్లు త్వరిత గతిన మంజూరు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రుణాలను ఎప్పటికప్పుడు మంజూరి చేసి వారికి ఉపాధి కల్పించాలని సూచించారు. మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇతర ఉపాధి పనులు చేసుకునేందుకు రుణాలు ఇవ్వాలన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల రైతుబంధు విడుదల చేసిందని రైతుబంధు సహాయాన్ని కొన్ని బ్యాంకర్లు రుణాల కింద జమ చేసుకుంటున్నారని అలా చేస్తే రైతులు ఇబ్బంది పడుతారని చెప్పారు. చేనేత కార్మికులకు బ్యాంకర్లు కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ప్రభుత్వం క్లిష్ట సమయంలో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకుని వారికి చేయూత నిచ్చిందని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, లీడ్బ్యాంక్ మేనేజర్ రవీందర్, డీడీఎం శ్రీనివాస్ బ్యాంక్ మేనేజర్లు రామ్ప్రసాద్తోపాటు అధికారులు పాల్గొన్నారు.