గద్వాల, జూన్ 21 : ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘పుట్టుక నీది.. చావు నీది.. నడు మ జీవితమంతా తెలంగాణది’ అనే నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ పోరాటమే కాకుండా రాజకీయ ప్రక్రియ అవసరమని కేసీఆర్కు మార్గనిర్ధేశం చేసిన గురువు అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం లో పాల్గొనడమే కాకుండా తన 50 ఏండ్ల పోరాట కాలం లో మూడు దశల తెలంగాణ పోరాటాలకు ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు. తెలంగాణ కోసం ఆస్తులనే కాకుండా వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఎంపీపీలు ప్రతాప్గౌడ్, విజయ్, జెడ్పీటీసీలు ప్రభాకర్రెడ్డి, రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, సర్పంచ్ మజీద్, కౌన్సిలర్లు మురళి, కృష్ణ, శ్రీను, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
వడ్డేపల్లిలో..
వడ్డేపల్లి, జూన్ 21 : ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని సోమవారం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మానవపాడు, ఉండవెల్లి, రాజోళి, అలంపూర్లలో కూడా కార్యక్రమాలు నిర్వహించామని జిల్లా కోశాధికారి రామచంద్రాచారి తెలిపారు.కార్యక్రమంలో వీరేషాచారి, పంపయ్యాచారి, సురేంద్రాచారి, మానవపాడు మండలాధ్యక్షుడు అమరలింగాచారి, ధనుంజయాచారి పాల్గొన్నారు.