మిడ్జిల్, మే 16 : అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. సీఐ శివకుమార్, ఎస్సై జయప్రసాద్ కథనం మేరకు.. మిడ్జిల్ గ్రామానికి చెందిన బాల్రెడ్డి(46) మండలంలోని వస్పుల్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తన భార్య రాజేశ్వరి పేరుమీద మిడ్జిల్లో పెట్రోల్బంక్ ఉంది. శనివారం రాత్రి పెట్రోల్బంక్ లావాదేవీలు పూర్తి చేసుకొని ఒకరోజు ఆదాయం రూ.లక్షా 10వేలు తీసుకొని తన ఇంటికి వెళ్లాడు. ఆదివారం పెట్రోల్బంక్ తాళాల కోసం అందులో పనిచేసే గౌస్ బాల్రెడ్డి ఇంటికి వెళ్లాడు.
ఒకవైపు తలుపు తెరిచి ఉండటంతో దగ్గరకు వెళ్లి చూడగా, బాల్రెడ్డి మృతిచెంది కనిపించాడు. జడ్చర్లలో ఉన్న అతడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ శివకుమార్, ఎస్సై జయప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అలాగే క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్తో విచారణ నిర్వహించారు. బాల్రెడ్డి మెడభాగం, చెవి నుంచి రక్తం వచ్చినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ, ఎస్సై తెలిపారు. కాగా, పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా బాల్రెడ్డి కొం తకాలం పని చేశారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. అతడి మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నా భర్తను కొట్టి చంపారు..
తన భర్త శరీరంపై గాయాలు ఉన్నాయని, ఇంట్లో ఉన్న రూ.లక్షా 10వేల కోసం కొట్టి చంపారని బాల్రెడ్డి భార్య రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జడ్చర్ల నుంచి మిడ్జిల్కు వచ్చారని, పెట్రోల్బంక్ లావాదేవీలను ముగించుకొని మిడ్జిల్లోని ఇంట్లో ఉన్నారని తెలిపారు.
రాత్రివేళ కొందరు దుండగులు తన భర్తపై దాడి చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తన భర్తను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.