టీబీ డ్యాంకు 168 టీఎంసీల వరద
జూలై 20 నుంచే పంటలకు నీటి విడుదల
తుంగభద్ర బోర్డు సమావేశంలో అధికారుల నిర్ణయం
అయిజ, మే 14 : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 2021-22 ఏడాదికిగానూ 5.16 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది వానకాలంలో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి 168 టీఎంసీల మేర నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు నీటి కేటాయింపులు జరిపారు. తుంగభద్ర పరీవాహక రాష్ర్టాలకు కేడబ్ల్యూడీటీ 212 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కేటాయింపులు చేసింది. నాలుగైదేండ్లుగా టీబీ డ్యాంకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది 168 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేశారు. అందుకనుగుణంగా కర్ణాటకకు 110 టీఎంసీలు, ఏపీకి 52.07 టీఎంసీలు, తెలంగాణలోని ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 5.16 టీఎంసీలను కేటాయింపులు జరుపుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వానకాలం పంటల సాగుకు జూలై 20 నుంచే నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. టీబీ డ్యాం ఎగువన వానలు సకాలంలో కురుస్తాయని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయా రాష్ర్టాల అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుంగభద్ర బోర్డు మొదటి సమావేశం గురువారం వర్చువల్ విధానంలో జరిగింది. టీబీ బోర్డు ఎస్ఈ ఎన్.వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గద్వాల ఎస్ఈ శ్రీనివాసరావు, కర్నూల్ ఎస్ఈ రామచంద్ర మూర్తి, అనంతపురం హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్, మునీరాబాద్ ఎస్ఈ బసవరాజు పాల్గొన్నారు.