ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల, జూన్13: గద్వాల నియోజకవర్గంలోని రైతుల చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం ధరూర్ మండలంలోని ర్యాలంపాడ్ రిజర్వాయర్ ఫేజ్-1 నుంచి మోటర్లు ఆన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గతేడాది భారీ వర్షాలు కురువడం వల్ల జూరాల ప్రాజెక్టు నిండుకుండులా మారిందని గుర్తుచేశారు. జూరాల నుంచి ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నింపామన్నారు. రిజర్వాయర్లు నిండిన అనంతరం కాలువల నుంచి ప్రతి గ్రామంలోని చెరువులు,కుంటలు నింపి రైతుల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని తెలిపారు. జూరాల,ర్యాలంపాడ్,గుడ్డెందొడ్డి రిజర్వాయర్లో నీరు పుష్కలంగా ఉండడం వల్ల రైతులు పంటలు బాగా పండించారన్నారు. కృష్ణానదిలో నీటి ప్రవాహాన్ని బట్టి రిజర్వాయర్లను నీటితో నింపే విధంగా ప్రణాళిక రూపొందించి నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడ దేశానికి అన్నం పెట్టేది తెలంగాణ రైతులని పేర్కొన్నారు. కార్యక్రమంలో ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, నాయకులు జాకీర్, శ్రీరాములు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.