మూసాపేట, మే 10 : చెరువుకు ప్రధాన పాటు వచ్చే కాల్వ తొలగింపుపై మండలంలోని నందిపేట గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. పాటుకాల్వను పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్, ఎంపీడీవోతోపాటు పలువురు ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిపేట గ్రామశివారులోని 4, 8, 16, 17 సర్వే నంబర్లలో దాదాపు 40 ఎకరాల్లో “రేణుక గ్రీన్ ఫామ్స్” పేరుతో ఫామ్ ల్యాండ్ ముసుగులో ఒక గుంట, రెండు గుంటలు, ఐదు గంటలు ఇలా ప్లాట్లుగా విభజించి వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సర్వే నంబర్ల మధ్యలో నందిపేట గ్రామానికి చెందిన ఊర చెరువుకు ప్రధాన పాటు వచ్చే కాల్వ పూర్వకాలం నుంచి ఉంది. కాల్వను ఆదివారం రాత్రికి రాత్రే పూడ్చారు. విషయాన్ని సర్పంచ్ శేఖర్రెడ్డి దృష్టికి స్థానిక రైతులు తీసుకెళ్లగా, ఆయన జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్యకు తెలియజేయడంతోపాటు, తాసిల్దార్ మంజుల, ఐబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, పూర్వకాలం నుంచి వచ్చే వంపును తొలగిస్తే చెరువుకు చుక్క నీరు రాదని, పాటుకాల్వ ఏవిధంగా ఉందో అదేవిధంగానే ఉండాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ అక్కడికి చేరుకొని పాటుకాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెరువులు, పాటు కాల్వలను పునరుద్ధరణ చేస్తుంటే, మరోవైపు వెంచర్ల పేరుతో కాల్వలను పూడ్చివేయడం సరికాదని, వంపును తొలగించిన వారిపై కేసు నమోదు చేసి, కాల్వను యథావిధిగా పునరుద్ధరణ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గ్రామ రైతులు తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో ఉమాదేవికి వినతిపత్రం అందజేశారు. ఆయా సర్వేనంబర్లకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేయకూడదని, పాటు కాల్వను సర్వే చేయించి తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, ఉపసర్పంచ్ శేఖర్, టీఆర్ఎస్ నాయకులు గూపని కొండయ్య, రాజేందర్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, వెంకట్రాములు, సీహెచ్ యాదగిరి పాల్గొన్నారు.