ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
నర్వలో కంది విత్తనాలు పంపిణీ
ఊట్కూర్, జూన్ 9 : అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రాయితీ పథకాలను అందజేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం నర్వ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు కంది విత్తన పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్తోపాటు రైతు బీమా, రైతుబంధు పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నారాయణపూర్ డ్యాం ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరు వృథా కాకుండా జిల్లాలోని జూరాల, భూత్పూర్, కోయిల్సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులను నింపినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి కష్టం రానివ్వకుండా రెండు పంటలకు సాగు నీటిని అందిస్తామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందివ్వాలని ఆదేశించారు. వివిధ గ్రామాల రైతులకు కందులు మినికిట్స్ (పీఆర్జీ 176) అందజేశారు. విత్తనం ఎండు తెగులును తట్టుకోనందున విత్తనశుద్ధిని తప్పనిసరిగా చేపట్టాలని ఏవో గణేశ్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములు శెట్టి, జెడ్పీటీసీ గౌని జ్యోతి, వైస్ ఎంపీపీ వీణావతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, కిరణ్ప్రకాశ్రెడ్డి, ఎంపీడీవో రమేశ్కుమార్, ఏఈవో వెంకట్రాములుగౌడ్, శ్వేత, మహేశ్ పాల్గొన్నారు.
పెద్దచెరువు మరమ్మతులు పూర్తిచేయాలి
మక్తల్ టౌన్, జూన్ 9 : వానకాలం పంటల సాగుకు అవసరమైన నీరు నిలిచేలా పెద్దచెరువును సిద్ధంగా ఉంచాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ (పెద్ద చెరువు) తూము మరమ్మతు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దచెరువు ఆయకట్టు కింద 500 ఎకరాలకు సాగునీరు పారుతుందని తెలిపారు. చెరువు కింది ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్ట్టులను త్వరగా పూర్తి చేసి ఏడాదికి రెండు పంటలు పండించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్, జూరాల, రామన్పాడు వంటి ప్రాజెక్టుల నుంచి దాదాపు అన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఈ నాగశివ, నాయకులు పాల్గొన్నారు.