గద్వాల, జూన్ 8: ప్రతి వయోవృద్ధులు రోగనిరోధక శక్తి పెంచుకునేలా కొవిడ్ టీకా వేయించుకోవాలని కలెక్టర్ శృతిఓఝా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళ శిశు సంక్షేమశాఖ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 60ఏండ్లు దాటిన వయోవృద్ధులు కొవిడ్ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన సహాయం కోసం 14567, దివ్యాంగులకు 18005728980కు సంప్రదించాలని తెలిపారు. ప్రస్తుతం కరోనా రెండో దశ ఉన్నందున వయోవృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని వేళలా ఇంట్లోనే ఉండడం, ఇంటికి సందర్శకులను నివారించడం, ఎట్టి పరిస్థితిలో చిన్న పెద్ద జన సమూహాలకు దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం, సీపీవో లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.