అయిజ, మే 21 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. కేరళ తీరం నుంచి రుతుపవనాల రాక మొదలవడంతో కర్ణాటకలో వానలు దంచికొడుతున్నాయి. దీంతో టీబీ డ్యాంకు ఇన్ఫ్లో భారీగా పెరుతున్నది. శనివారం ఇన్ఫ్లో 72,592 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 229 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 100.855 గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యానికిగానూ, ప్ర స్తుతం 19.766 టీఎంసీల నీటినిల్వ ఉంది.
1633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికిగానూ, ప్రస్తుతం 1600 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్అధికారి విశ్వనాథ్ తెలిపారు. టీబీ డ్యాంకు వరద ముందస్తు గా చేరుతుండటంతో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చే స్తున్నారు. డ్యాంకు నీటిరాకతో నారుమళ్లు పోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.