ఇలా ఉంటే ఎలా..?
రెండ్రోజుల్లో పూర్తి చేయాలి
జెడ్పీ సీఈవో విజయనాయక్
మల్దకల్, జూన్ 5 : చెత్తా చెదారాన్ని డంపింగ్ యార్డు ఎదుట ఉంచడమేంటి..? వేరు చేయాలని తెలియదా..? ఇలా ఉంటే దుర్గంధంగా మారి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు లేవా..? అంటూ పంచాయతీ కార్యదర్శి రాణాపై జెడ్పీ సీఈవో విజయనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని అమరవాయి గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం, డంపింగ్ యార్డును పరిశీలించారు. వైకుంఠధామం పనులు పూర్తి అయినా.. దానిపై ఎందుకు పేరు రాయలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అలాగే వైకుంఠధామంలో మట్టిని శుభ్రంగా ఉంచాలని.. మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డంపింగ్ యార్డులో వేరు చేయాల్సిన స్థలంలో కాకుండా.. ముందర ఉన్న స్థలంలో చెత్త వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో వేరు చేసి ఫొటోలు పెట్టాలన్నారు. ఉపాధి కూలీలకు రూ.12 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.4 లక్షలు మాత్రమే పంపిణీ చేశారని కూలీలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. రూ. 8 లక్షలను కూలీలకు పంపిణీ చేసేలా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, ఏపీవో స్వామి తదితరులు పాల్గొన్నారు.