జోగులాంబ గద్వాల : జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ల పరిధిలో ఉన్న ధరణి ధరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో ధరణి పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలని , మండల పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించిన ధరణి దరఖాస్తులను ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని వీలైతే అన్ని పెండింగ్ దరకాస్తులను పూర్తి చేయాలన్నారు.
సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. సాక్ష్యాలు ,తిరస్కరించిన, ఆమోదించిన తదితర కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి క్లియర్ చేయాలని తహసిల్దార్లను ఆదేశించారు.
అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, వ్యాక్సినేషన్ శాతం తక్కువ ఉన్న గ్రామాల పై దృష్తి సారించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రజలందరు వ్యాక్సిన్ వేసుకునేలా వారికి అవగాహన కల్పించి జిల్లా లో 100 శాతం పూర్తి చేయాలలన్నారు.
తదనంతరం ప్రజావాణిలో ఫిర్యాదులు సమర్పించడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ధరఖాస్తులను స్వీకరించారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.