వడ్డేపల్లి: తుమ్మిల్ల లిఫ్ట్ ఏర్పాటుతో పాటుగా ఆర్డీస్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం 13 కోట్లు మంజూరు చేసిందని, మల్లమ్మ కుంట రిజర్వాయర్ మంజూరు కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో ఎంపీపీ రజితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి సమస్యల పరిష్కారం గురించి అధికారులతో, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
ర్యాలంపాడు, కలుకుంట్ల-బూడిద పాడు, ఎక్లాస్ పురం, రాజేశ్వరి వంతెన పనులు మందకోడిగా ఎందుకు సాగుతున్నా యని ఎమ్మెల్యే ఆర్అండ్బీ ఏఈ మహేశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెంకట్రామనగర్లో, రామాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందని, వెంకట్రామనగర్ సెంటర్కు ఇన్చార్జిగా ఉన్న వారు వారంలో రెండు రోజులు సెంటర్కు తప్పకుండా వచ్చేలా చూడాలని సీడీపీవో సుజాతకు ఎమ్మెల్యే సూచించారు.
అంగన్వాడీ సెంటర్లలో స్టాకు వివరాలపై ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎంపీడీవో భవనం పనులు వేగంగా జరిగేలా చూడాలని పీఆర్ఏఈ లక్ష్మీనారాయణ రెడ్డిని జడ్పీటీసీ కాశపోగు రాజు కోరారు. అలాగే కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండటంలేదని, వృద్ధులు వంటలు సరిగ్గా చేయలేక పోతున్నారని అన్నారు.
నాణ్యమైన భోజనం వండేలా ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షణ చేయాలని, అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కలపై పర్యవేక్షణ కొరవడిందని చాలా మొక్కలు చనిపోయాయని ఎంపీపీ రజితమ్మ అన్నారు. కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సీఈవో విజయ్ నాయక్, ఎంపీడీవో రవీంద్ర, అధికారులు, ఆయాగ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.