3చోట్ల ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు
త్వరలో అందుబాటులోకి..
గద్వాల న్యూటౌన్, జూలై 29 : ట్రాఫిక్ సమస్యకు చెక్ పేట్టెందుకు పోలీస్శాఖ సిద్ధమైంది. నూతనంగా జిల్లా కేంద్రంలో ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పనులు కొనసాగుతుండగా త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 7చోట్ల ఆటోమెటిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతానికి 3చోట్ల చౌరస్తాల్లో ఏర్పాటు అనుమతి లభించగా.. అందులో కృష్ణవేణి చౌరస్తా, గాంధీచౌక్, వైఎస్సార్ చౌరస్త్తాల్లో ఆటోమెటిక్ స్నిగల్స్ను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా ప్రజల ట్రాఫిక్ సమస్యకు తెరపడనున్నది.
తీరనున్న ట్రాఫిక్ సమస్య
జిల్లా కేంద్రంలో రోజురోజుకూ జనాభా పెరుగుతుంది. దాంతోపాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా రెట్టింపు అవుతున్నది. దీనికితోడు రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారుల్లో అవగాహన కరువైంది. రాంగ్ రూట్, మితిమీరిన వేగంతో పలుచోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్స్ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యతో పాటు వేగాన్ని నియంత్రించేందుకు పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలో మూడు చోట్ల సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనున్నది.
1,07,000 వాహనాలు
జిల్లాలో మొత్తం 1,07,000 రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 84,000 బైక్లుండగా, కార్లు 4,435, వ్యవసాయ ట్రాక్టర్లు 4,400, కమర్షియల్ ట్రాక్టర్లు 1800, ట్రైలర్ అగ్రికల్చర్ ట్రాక్టర్లు 2440, అగికల్చర్ కమర్షియల్ ట్రాక్టర్లు 1440, మ్యాక్సి క్యాబ్లు 106, టూరిస్టు క్యాబ్లు 27, ఆటో రిక్షాలు 1,976, హార్వెస్టర్లు 30, విద్యాసంస్థల బస్సులు 240, ఓమ్ని బస్సులు 183, గూడ్స్ వాహనాలు 3500, అంబులెన్స్ వాహనాలు 12, ఇతరత్రా వాహనాలు 2,463 ఉన్నాయి.
ముమ్మరంగా పనులు
జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌరస్తా, వైఎస్సాఆర్ చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంతాల్లో సిగ్నల్స్కు సంబంధించిన పోల్స్ను ఏర్పాటు చేసి సిగ్నల్స్ లైట్స్ను బిగించారు. వీటికి కరెంట్ సరఫరా ప్రక్రియను చేపడుతున్నారు. సిగ్నల్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలీస్శాఖ ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకే..
ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణకు సిగ్నల్స్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుంది. జిల్లా కేంద్రంలో గాంధీచౌక్, కృష్ణవేణి చౌరస్తా, వైఎస్సాఆర్ చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేశాం. త్వరలో సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం. వాహనదారులంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
–విక్రమ్, ట్రాఫిక్ ఎస్సై, గద్వాల