క్రాప్ హాలిడేకు సిద్ధమవుతున్న రైతన్నలు
ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం..రైతుల పాలిట శాపం
పంట కాలువలోకి మురుగు వదిలిన పీఆర్ అధికారులు
చౌడు తేలుతున్న పంట పొలాలు
పంటలకు నీరిచ్చి ఆదుకోవాలని రైతుల వేడుకోలు
గద్వాల, జూలై 29 : ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టడంతోపాటు చెరువు, కుంటలు నింపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటే జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా 100 ఎకరాల పంటలకు నీరు అందని పరిస్థితి నెల కొన్నది. తలాపున నీరు ఉన్నా పొలాలకు అందని పరిస్థితి నెలకొన్నది. కాలువ పూడిక తీయించి పిల్లకాలువలను ఉపాధి పనుల్లో శుభ్రం చేయించాలని రైతులు వేడుకున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ వానకాలం పంటలకు నీరుఅందే పరిస్థితి లేకపోవడంతో పంట భూములు బీడు భూములుగా మారే పరిస్థితి నెలకొన్నది. పనులు చేయించి నీరు పారేలా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులను వేడుకున్నా మరమ్మతులకు నిధులు లే వని మీరే మరమ్మతులు చేసుకొని నీటిని పా రించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు.
అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం చిన్నతాండ్రపాడ్ గ్రామంలో చెరువు కింద పిల్ల కాలువ ఉంది. మిషన్భగీరథ పైపులు వేసే సమయంలో అధికారులు తమ పనిచేసుకొని పిల్లకాలువలో మట్టి తోశారు. దీంతో కాలువ మట్టితో నిండిపోయి కింది పొలాలకు నీరు పారే అవకాశం లేకుండా పోయింది. మట్టి తీసి పంట పొలాలకు నీరు అందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను రైతులు వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. మిషన్ భగీరథ పైపులు వేసే సమయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడ లేకపోవడంతో వారు ఇష్టారీతిలో పనులు చేసుకొని వెళ్లిపోయారు. కా లువలపై తిరిగి పర్యవేక్షించాల్సి అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులకు దుస్థితి దాపురించింది.
తలాపున నీరు..పంట పొలాలకు పారని వైనం..
రైతుల పంట పొలాలపైనే పెద్ద చెరువు ఉంది. గ్రామ సమీపంలో ఉన్న చిన్న కాల్వ ద్వారా చెరువు నీటిని పంటపొలాలకు రైతులు మళ్లించే వారు. అయితే ప్రస్తుతం తలాపున పుష్కలంగా నీరు ఉన్నా చుక్క నీరు రైతుల పంటలకు పారని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఈ ఏడాది రైతులు పంటలు సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
క్రాప్ హాలిడేకు సిద్ధమవుతున్న రైతులు
కాల్వలో వేసిని మట్టిని తొలగించాలని రైతులు వేడుకున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఆర్డీఎస్ కాలువ నుంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా చెరువులోకి నీరువదిలి ఆ నీటిని పిల్ల కాల్వల ద్వారా పంట పొలాలకు మళ్లించే వారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రైతుల కళ్ల ముందు నీరు పుష్కలంగా పారుతున్న తమ పంటలకు నీరు పారకపోవడం పంట పొలాలు బీళ్లుగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగునీరు వెళ్లే కాలువలోకి మురుగు
రైతుల పంట పొలాలకు ఓ వైపు సాగునీరు అందక అవస్థలు పడుతుంటే పుండుపై కారం చల్లినట్లు పంట పొలాలకు వెళ్లే కాలువను పంచాయతీ రాజ్ అధికారులు ధ్వం సం చేసి పంట కాలువలోకి డ్రైనేజీ ఏర్పాటు చేసి ఊరిలో ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీరు అంతా కాలువలోకి వెళ్లే విధంగా డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. డ్రైనేజీల ద్వారా వచ్చే మురుగు నిరంతరం రెండు ఇంచుల మేర పంట కాలువలో కలుస్తుంది. దీంతో పంటలు విషపూరితంగా మారుతున్నాయి. పొలాలు చౌడు బారి వేసిన పంట ఎండిపోతుంది. ఈ విషయంపై పంచాయతీ అధికారులను ప్రశ్నిస్తే డ్రైనేజీ కూలగొట్టండి అం టూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రై తులకు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి పంట పొలాలకు వెళ్లే కాలువకు మరమ్మతులు చేసి ము రుగు పంట కాలువలోకి వెళ్లకుండా చర్య లు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.