న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా చేరడం 15 ఏండ్లలో ఇదే తొలిసారి. ఇక ఇవాళ ఉదయం ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అండర్ పాస్ల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఏరియాలో ఉదయం 7 నుంచి 8:30 గంటల మధ్యలో 2.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఢిల్లీకి సమీపంలోని ఎన్సీఆర్, గోహనా, సోనిపట్, రోహతక్, కేక్రా ఏరియాల్లోనూ వర్షం కురిసింది.
నిన్నటి వరకు దంచికొట్టిన ఎండలతో ఉక్కపోతకు గురయ్యామని, ఇవాళ ఉదయం వర్షం కురియడంతో.. ఉపశమనం కలిగిందని ఓ యువకుడు పేర్కొన్నాడు. వర్షంలో ఎంజాయ్ చేశామని, ఈ వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని తెలిపాడు.